ఆదివాసీలకు న్యాయం చేయండి : గవర్నర్కు అఖిలపక్ష నేతల వినతి
హైదరాబాద్ : అటవీ భూముల హక్కుల చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదని అఖిలపక్ష నేతలు మండిపడ్డారు. చట్టం అమలుల్లో లోపాలు ఉన్నాయని, వాటిని గుర్తించి.. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఇటీవల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన ఘటనను గుర్తుచేశారు. ఈ మేరకు బుధవారం గవర్నర్ కు అఖిలపక్ష నేతలు ఫిర్యాదు చేశారు.

అటవీ భూముల సమస్యలను పరిష్కరించాలని గవర్నర్ నరసింహన్ ను కోరారు. కోదండరాం అధ్యక్షతన టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు రమణ, ఆ పార్టీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి, గోవర్ధన్ తదితరులు గవర్నర్ తో సమావేశమయ్యారు. వినతిపత్రం అందజేసి ... వారి సమస్యలను తెలియజేశారు. ప్రధానంగా పోడు భూముల విషయంలోనే ప్రభుత్వంతో గిరిజనులు ఘర్షణ పడుతున్నారని గుర్తుచేశారు.
2006లో ఆదీవాసీలకు పోడుభూముల విషయంలో చట్టబద్దత కల్పించినా .. ఆ చట్టం సరిగా అమలు కావడం లేదన్నారు కోదండరాం. కొందరికీ పాస్ పుస్తకం ఇస్తే భూమి ఇవ్వలేదని గుర్తుచేశారు. మరికొందరు భూమి ఇచ్చి .. పాస్ పుస్తకం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర తెలంగాణలో ఆదివాసీల జీవనానికి ఉపయోగించే భూమిని ప్రభుత్వం ధ్వంసం చేస్తుందని రమణ ఆరోపించారు. అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం ఆదీవాసీలకు న్యాయం చేయాలని కోరారు.












Click it and Unblock the Notifications