అవును! న్యాయమైనదే: కేసీఆర్తో మోడీ, 'బాబు వద్ద ఆధారాల్లేవ్'
న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణ న్యాయమైనదేనని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారని తెలంగాణ మంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీ చేసిన తీర్మానం కాపీని సీఎం కెసిఆర్, మంత్రి కడియంలు ప్రధాని మోడీకి ఇచ్చారు. ఈ విషయమై కడియం అనంతరం విలేకరులతో మాట్లాడారు.త
వర్గీకరణ న్యాయమైనదేనని ప్రధాని మోడీ అన్నారని చెప్పారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందడం లేదని, ఎస్టీల్లోను ఇదే పరిస్థితి ఉందన్నారు. వర్గీకరణ అమలు చేయడానికి దేశవ్యాప్తంగా జాప్యం జరుగుతోందని ప్రధాని మోడీ అన్నారని చెప్పారు. అయితే, తెలంగాణ వరకు అనుమతివ్వాలని కోరినట్లు చెప్పారు.
తెలంగాణకు కరువు సాయంగా రూ.3067 కోట్లు ఇవ్వాలని కోరామన్నారు. ప్రాజెక్టుల పైన ఏపీ రాద్దాంతం సరికాదన్నారు. ఏపీ అభ్యంతరాలకు సీడబ్ల్యూసీ జవాబే నిదర్శనం అన్నారు. తమకు కేటాయించిన నీటినే కొత్త ప్రాజెక్టులకు వాడుకుంటామని స్పష్టం చేశారు.
ఏపీకి అభ్యంతరాలకు ఆదారాలు లేవన్నారు. రైతు ఆత్మహత్యలకు వ్యక్తిగత కారణాలు కూడా ఉన్నాయని చెప్పారు. ప్రతి ఆత్మహత్యకు కరువుతో లింక్ పెట్టవద్దని కడియం అన్నారు. ఎస్సీ వర్గీకరణపై తమ ప్రభుత్వ చిత్త శుద్ధిని శంకించాల్సిన అవసరంలేదన్నారు.
అఖిలపక్షం కన్నా ముందే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రధాన మంత్రి మోడీతో నేరుగా చర్చించారని తెలిపారు. ఎస్సీల్లో అన్ని వర్గాల వారికి న్యాయం జరగడంలేదని ప్రధాన మంత్రి సైతం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు చెప్పారు. ఎస్సీ వర్గీకరణ సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోసం కలిసివచ్చే వారిందరిని కలుపుకుని ముందుకు పోతామన్నారు.