పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడండి: టిడిపి నేతలకు పోచారం
హైదరాబాద్: తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకులు పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడాలని, పక్క రాష్ట్రంలో వారి పార్టీయే అధికారంలో ఉందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. రుణ మాఫీ పేరుతో విపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే యాభై శాతం రుణాలను చెల్లించామన్నారు. మిగిలిన యాభై శాతం రుణాలతో రైతులకు సంబంధం లేదని, బ్యాంకు అధికారులు రైతులకు రుణమాఫీ ప్రతాలను కూడా అందజేస్తున్నారన్నారు. అయినప్పటికీ విపక్ష పార్టీలు అర్ధం పర్ధం లేని ప్రకటనలు చేస్తూ ఆందోళనలకు దిగడం ఏమాత్రం భావ్యమో వారే ఆలోచించుకోవాలన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పరిహారం ఇస్తున్నామని, అయినా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన అన్నారు. సభను అడ్డుకోవడమే ప్రతిపక్షాలు పనిగా పెట్టుకున్నాయని ఆయన అన్నారు. ప్రజలకు ఉపయోగపడే చర్చ జరగాలని ముఖ్యమంత్రి కెసిఆర్ కోరారని, అయినా సభను అడ్డుకున్నారని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వ సహాయంతో సంబంధం లేకుండా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని చెప్పారు. వడ్డీతో సహా రైతు రుణాలను ప్రభుత్వమే చెల్లిస్తుందని, రైతులు ఆందోళన చెందవద్దని పోచారం అన్నారు. త్వరలోనే కరువు మండలాలను ప్రకటిస్తామని చెప్పారు.
తెలంగాణలో రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామనిమంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి చెప్పారు. అసెంబ్లీలో ఏ చర్చకైనా సిద్ధంగా ఉన్నామని సీఎం కేసీఆర్ బీఏసీలో స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. బీఏసీలో తీసుకున్న నిర్ణయం మేరకు రైతుల సమస్యలపై అసెంబ్లీలో విస్తృతంగా చర్చ జరిగిందన్నారు.
సీఎం కూడా చాలా వివరంగా సమాధానం ఇచ్చారని, విపక్షాలు మాట్లాడుతున్నప్పుడు తాము అడ్డుపడలేదని, విపక్షాలే సభలో గందరగోళం వాతావరణం సృష్టించాయని ఆయన విమర్శించారు. రైతు రుణాలు ప్రభుత్వమే చెల్లిస్తున్నట్లు బ్యాంక్ మేనేజర్ల సంతకంతో లెటర్లు ఇచ్చారని తెలిపారు. రైతు రుణాలపై పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చినా విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.