దురలవాట్లతో ఎటిఎం కార్డుల దొంగగా మారిన విద్యార్థి
హైదరాబాద్: ఎటిఎం సెంటర్లవద్ద అమాయకుల దృష్టి మరల్చి డబ్బు తస్కరిస్తున్న దొంగను హైదరాబాదులోని మాదన్నపేట పోలీసులు అరెస్టుచేసారు. సోమవారం ఠాణాలో ఏర్పాటుచేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఇన్స్పెక్టర్ కెవి రాజు వివరాలు వెల్లడించారు. మాదన్నపేటకి చెందిన ఫాతిమాబేగం ఈ నెల 17న దోబీఘాట్ యస్బిఐ ఎటిఎం సెంటర్లో డబ్బులు డ్రా చేసేందుకు వెళ్ళగా అక్కడే ఉన్న గుర్తు తెలియని యువకుడు ఆమె దృష్టి మరల్చి ఎటిఎం కార్డు తస్కరించి వేరేచోట 30వేల నగదు డ్రా చేసుకున్నాడు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు ప్రారంభించిన మాదన్నపేట పోలీసులు ఆదివారం మాదన్నపేట ఎటిఎం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఎండి ఇలియాసుద్దీన్ అలియాస్ అస్లాం (26)ను అదుపులోకి తీసుకుని విచారించగా ఫాతిమావద్ద కార్డు తస్కరించింది తానేనని ఒప్పుకున్నాడు.

మరో ఇద్దరివద్ద కూడా కార్డులు తస్కరించినట్లు తేలింది. మాదన్నపేటకు చెందిన అలిముద్దీన్ కుమారుడైన అస్లాం విద్యార్థి. దురలవాట్లకు బానిసై డబ్బుకోసం ఈ మార్గం ఎంచుకున్నాడని పోలీసులు తెలిపారు. అతనివద్ద మూడు ఎడిఎం కార్డులు, రెండువేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఎటిఎం కార్డులను ఎలా వాడాలనే విషయాన్ని తెలియజేస్తున్నట్లు నటిస్తూ అతను వాటిని దొంగిలించేవాడని చెప్పారు. పిన్ నెంబర్ నోట్ చేసుకుని, బాధితురాలికి అసలు కార్డు ఇవ్వడానికి బదులు మరో కార్డు ఇచ్చాడు. ఆ కార్డును మరో ఎటిఎం సెంటర్లో వాడి డబ్బులు డ్రా చేశాడు. తాను ఆరు వెల రూపాయలు డ్రా చేసినట్లు నిందితుడు అంగీకరించాడు.












Click it and Unblock the Notifications