మల్లన్న 'దీక్ష' రాజకీయం: జగ్గారెడ్డి అరెస్ట్, సంగారెడ్డిలో ఉద్రిక్తత
హైదరాబాద్: తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం తీరుకు నిరసనగా మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు మద్దతుగా మెదక్ జిల్లా కోర్టులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) బుధవారం ఉదయం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఉద్రిక్తతకు దారి తీసింది.
జగ్గారెడ్డి దీక్షకు అనుమతి లేని కారణం చేత దీక్షకు అనుమతించబోమని పోలీసుల తేల్చి చెప్పారు. అయినప్పటికీ జగ్గారెడ్డి రైతులకు మద్దతుగా తాను దీక్ష చేసి తీరుతానని మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఆయన భారీ అనుచరగణంతో దీక్షా స్థలికి చేరుకుని దీక్షకు దిగారు.
దేనికోసం?: కేసీఆర్ ప్రభుత్వం తీరుకు నిరసనగా జగ్గారెడ్డి ఆమరణ దీక్ష
జగ్గారెడ్డి దీక్షను అడ్డుకునేందుకు సంగారెడ్డిలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ఈ క్రమంలో భారీ అనుచరగణంతో అక్కడికి వచ్చిన జగ్గారెడ్డిన పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో జగ్గారెడ్డి వర్గీయులు, పోలీసులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉద్రక్త వాతావరణం చోటు చేసుకుంది.
దీక్ష ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి తన ప్రాణం పోయినా దీక్ష నిర్వహించే తీరుతానని భీష్మించుకుని కూర్చున్నారు. దీక్ష ప్రాంతంలో సెక్షన్ 30 అమలులో ఉన్నందున దీక్షకు అనుమతించే పరిస్థితులు లేవని పోలీసులు స్పష్టం చేయడంతో పోలీసుల తీరుపై ఆయన మండిపడ్డారు.
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేసేవరకూ తన పోరాటం సాగుతోందని అన్నారు. కేసీఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం మల్లన్న సాగర్ నుంచే బీజం పడిందని తెలిపారు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు మద్దతుగా దీక్షను ప్రారంభిస్తానని, ఎవరు అడ్డుకుంటారో చూస్తానని తెలిపారు.