మంచిర్యాల జంట హత్యలు: వెలుగులోకి విస్తుపోయే విషయాలు... విజయవాడ నుంచి సుపారీ కిల్లర్
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 18న చోటు చేసుకున్న జంట హత్యల కేసును పోలీసులు చేధించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే భార్యతో పాటు ఆమె తల్లి హత్యలకు కారకుడని నిర్దారించారు. విజయవాడకు చెందిన సుపారీ కిల్లర్తో ఒప్పందం కుదుర్చుకుని వారితో హత్యలు చేయించినట్లు తేల్చారు. రామగుండం సీపీ సత్యనారాయణ మంచిర్యాల డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ హత్యలకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు.

రవీనా ప్రేమ వివాహం...
పోలీసుల కథనం ప్రకారం... మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బృందావన్ కాలనీలో పూదరి విజయలక్ష్మి(47),ఆమె కుమార్తె రవీనా(26),కుమారుడు నివాసం ఉంటున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన అరుణ్ కుమార్ను రవీనా ప్రేమ వివాహం చేసుకుంది. గతేడాది జూన్లో వీరి వివాహం జరిగింది. అయితే ఆ తర్వాత కొద్దిరోజులకే ఆమెకు అదనపు వరకట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి. ఇదే క్రమంలో రవీనా గర్భవతి కావడంతో ఆమె మంచిర్యాలలోని పుట్టింటికి వచ్చి అక్కడే ఉంటోంది.

పగబట్టిన భర్త... సుపారీ కిల్లర్తో...
పుట్టింటికి వచ్చాక భర్త,అత్తింటివారు పెడుతున్న చిత్రహింసల గురించి రవీనా తల్లి విజయలక్ష్మితో చెప్పింది. దీంతో తల్లి రవీనాకు అబార్షన్ చేయించింది. అప్పటినుంచి అరుణ్ తల్లీకూతుళ్లపై మరింత పగ పెంచుకున్నారు. ఒకానొక దశలో ఇక ఇద్దరిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో యూట్యూబ్లో 'సుపారీ కిల్లర్ విజయవాడ' అనే ఐడీ అరుణ్ కంటపడింది. అందులో ఇచ్చిన ఫోన్ నంబర్ ద్వారా ఆ వ్యక్తిని సంప్రదించాడు.

ఈ నెల 17న మంచిర్యాలకు సుపారీ కిల్లర్
అవతలి వ్యక్తి తన పేరు బిట్టు అని పరిచయం చేసుకున్నాడు. హత్యలకు రూ.10లక్షలు ఖర్చవుతుందని చెప్పాడు. అయితే అంత డబ్బు తన వద్ద లేదని అరుణ్ చెప్పాడు. తన అత్తవారింటిలో ఎప్పుడూ భారీ నగదు,నగలు ఉంటాయని... హత్యానంతరం వాటిని తీసుకోవాలని తెలిపాడు. దీంతో హత్యలకు ఒప్పుకున్న బిట్టు సుబ్బు అనే మరో వ్యక్తిని వెంటపెట్టుకుని ఈ నెల 17న మంచిర్యాలకు వచ్చాడు. అరుణ్ బిట్టును కలిసి బృందావన్ కాలనీలోని అత్తవారింటిని చూపించాడు.

తెల్లవారుజామున జంట హత్యలు...
ఆ మరుసటిరోజే బిట్టు,అరుణ్,సుబ్బు ముగ్గురు కలిసి హత్యలకు పాల్పడ్డారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ముగ్గురూ ఆ ఇంటి గోడ దూకారు. అనంతరం ఆ ఇంటి మేడ పైకి వెళ్లారు. ఉదయం 5గంటల సమయంలో విజయలక్ష్మి తలుపులు తీసుకుని బయటకు రాగా... ఒక్కసారిగా ఆమెపై దాడి చేశారు. తాడుతో మెడకు ఉరి బిగించి హత్య చేశారు. అనంతరం ఇంట్లోకి వెళ్లి రవీనాను కూడా అదే తరహాలో హత్య చేశారు. హత్యల అనంతరం బిట్టు ఇంట్లో ఉన్న నగలు,డబ్బుతో పరారయ్యాడు. ఈ నెల 28న పోలీసులు అరుణ్ను అరెస్ట్ చేయగా.. అతని నుంచి రాబట్టిన సమాచారం మేరకు ఈ నెల 29న బిట్టు,సుబ్బులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Recommended Video

సుపారీ కిల్లర్ నేపథ్యం
రోషయ్య అలియాస్ బిట్టు గుంటూరుకు చెందిన వ్యక్తి. డిగ్రీ తర్వాత ప్రేమ వివాహం చేసుకున్న అతను జల్సాలకు అలవాటుపడ్డాడు. ఓసారి యూట్యూబ్లో ఒక వీడియో చూసి గన్ కొనేందుకు వారిని సంప్రదించాడు. ఇందుకోసం రూ.30వేలు చెల్లించాడు. అయితే ఆ వ్యక్తి బిట్టును మోసం చేయడంతో... తాను కూడా అదే తరహాలో డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే యూట్యూబ్లో 'సుపారీ కిల్లర్ విజయవాడ' అనే ఐడీని క్రియేట్ చేశాడు. ఆయుధాలు విక్రయిస్తానని,సుపారీ హత్యలు,కిడ్నాప్లు చేస్తానని అందులో ప్రకటించాడు.












Click it and Unblock the Notifications