అజ్ఙాతంలోకి టీడీపీ నేత భవ్య ఆనంద్ ప్రసాద్: కుమారుడు, కోడలు అరెస్ట్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నాయకుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త, భవ్య సిమెంట్స్ అధినేత వీ ఆనంద్ ప్రసాద్ అజ్ఙాతంలోకి వెళ్లారు. తమను మోసం చేశారంటూ ఆయనపై కేసు నమోదైన వెంటనే ఆయన కనిపించకుండా వెళ్లారు. ఈ కేసులో ఆయన కుమారుడు, కోడలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆనంద్ ప్రసాద్తో పాటు ఆయన భార్య కూడా పరారీలో ఉన్నట్లు సమాచారం. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరులోనూ పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. ఆయన కాల్ లిస్ట్ ఆధారంగా వివరాలను సేకరిస్తున్నారని సమాచారం.
భవ్య సిమెంట్స్ అధినేతగా గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్ ప్రసాద్.. కొన్ని తెలుగు సినిమాలను నిర్మించారు. 2018 నాటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. హైదరాబాద్ శివార్లలోని శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి, ఓడిపోయారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలను ఇస్తామంటూ తమను నమ్మించి, మోసం చేశారంటూ జూపల్లి సత్యనారాయణ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భవ్య ఆనంద్ ప్రసాద్పై రామచంద్రాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆనంద్ ప్రసాద్ కుటుంబ సభ్యులు ఆదిత్య వెనిగళ్ల, శివకుమార్, కృష్ణకుమారి వెనిగళ్ల, నిఖిల వెనిగళ్లపై కేసు నమోదైంది.
ఈ విషయం తెలిసిన వెంటనే ఆనంద్ ప్రసాద్, ఆయన భార్య అజ్ఙాతంలోకి వెళ్లారు. కుమారుడు, కోడలిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. జూపల్లి సత్యనారాయణ, భవ్య ఆనంద్ ప్రసాద్ మధ్య ఈ వివాదం 2017 నుంచీ నడుస్తున్నట్లు సమాచారం. 2018 నాటి ఎన్నికల్లో ఓడిపోవడం, అనంతరం కంపెనీ నష్టాలను చవి చూడటంతో రియట్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఆయన ప్రారంభించలేకపోయారని అంటున్నారు. సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ.. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఆనంద్ ప్రసాద్ ప్రారంభించకపోవడంతో తన పెట్టుబడులు వెనక్కి ఇవ్వాలంటూ జూపల్లి సత్యానారాయణ డిమాండ్ చేశారు.
డబ్బులు అడిగితే.. తనపై బెదిరింపులకు పాల్పడినట్లు ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆనంద్ ప్రసాద్ కుమారుడు, కోడలిని అరెస్ట్ చేయగా, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆనంద్ ప్రసాద్, భార్యతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో జూపల్లి సత్యనారాయణతో పాటు మరికొందరిని మోసం చేశారనే ఆరోపణలు ఆనంద్ ప్రసాద్పై ఉన్నాయని తెలుస్తోంది. ఆయన కోసం పోలీసులు రెండు తెలుగు రాష్ట్రాల్లో గాలిస్తున్నారు. ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు.