20రోజులుగా మార్చురీలోనే గర్భిణీ మృతదేహం: కంటతడి పెట్టిస్తున్న ఆ చిన్నోడి మాటలు..
హైదరాబాద్: నగరంలోని బొటానికల్ గార్డెన్ సమీపంలో వెలుగుచూసిన గర్భిణీ పింకీ హత్య కేసులో.. మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులకు అప్పగించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఇప్పటికే ఆమె తల్లిదండ్రులు భుక్తిదేవి, డప్పులియాతోపాటు సోదరులను హైదరాబాద్కు సమాచారం అందించారు.
గర్బిణీ హత్య వెనుక 'మిస్టరీ' ఇదే: ఎలక్ట్రిక్ కట్టర్తో ముక్కలుగా నరికేశారు.
అందుకే ఆలస్యం..:
నిరుపేదలైన పింకీ తల్లిదండ్రులకు హైదరాబాద్ వచ్చేందుకు ఛార్జీలకు కూడా డబ్బులు లేవని అందువల్లే మృతదేహాన్ని అప్పగించడం ఆలస్యం అవుతోందని పోలీసులు తెలిపారు. బీహార్ పోలీసుల సహకారంతో మరో రెండు మూడు రోజుల్లో వారు ఇక్కడికి చేరుకుంటారని అన్నారు. కాగా, పింకీ మృతదేహాన్ని నిందితులుగా ముక్కలుగా కోయడంతో.. ఆ శరీర భాగాలను మార్చురీలో భద్రపరిచారు. గత 20రోజులుగా అవి మార్చురీలోనే ఉన్నాయి.
చైల్డ్కేర్ సెంటర్లో జతిన్:
తల్లి మృతితో ఒంటరైన ఆమె కొడుకు జతిన్ను సైఫాబాద్ భరోసా చైల్డ్కేర్ సెంటర్లో చేర్పించారు. జతిన్ను అతని తండ్రి దినేష్ వద్దకు చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. దినేష్ కూడా అతన్ని తీసుకెళ్లేందుకు అంగీకరించాడని అన్నారు. ఉత్తరప్రదేశ్లో ఉంటున్న దినేష్ రెండు మూడు రోజుల్లో హైదరాబాద్ వచ్చి జతిన్ను తీసుకెళ్తాడని చెప్పారు.
కంటతడి పెట్టించేలా..:
ప్రస్తుతం భరోసా చైల్డ్కేర్ సెంటర్లో ఉన్న జతిన్ అందరితో కలవలేకపోతున్నాడని, తల్లిని తలుచుకుని ఏడుస్తున్నాడని నిర్వాహకులు చెబుతున్నారు. తన తల్లి తనతో మాట్లాడిన చివరి మాటలతో పాటు, వారు ఆప్యాయంగా పెంచుకున్న కుక్క ఎక్కడంటూ జతిన్ పదేపదే అడుగుతుండటం నిర్వాహకులను కూడా కంటతడి పెట్టిస్తోంది.
సాధారణ స్థితికి వచ్చిన జతిన్ :
జతిన్కి అన్నం తినిపించిన చిన్న గిన్నె, అతని షూస్ ఇప్పటికీ ఆ ఇంట్లో అలాగే ఉన్నాయి. చైల్డ్ కేర్ సెంటర్ లో జతిన్ ఎవరితోనూ మాట్లాడలేకపోతుండటంతో.. పిల్లల సైకాలజిస్ట్ లావణ్య మిరియాలకు సమాచారం ఇచ్చారు. వీఎస్సీ ప్రతినిధులు లావణ్య, ఉమ ఈనెల 12వ తేదీన జతిన్కు కౌన్సెలింగ్ ఇవ్వగా.. ప్రస్తుతం అతను సాధారణ స్థితికి వచ్చినట్టు సమాచారం.