దేశంలోని ప్రధాన నగరాల్లో హడల్: తమిళ రామ్జీ ముఠా పట్టివేత
హైదరాబాద్: రామ్జీ ముఠా అంటే దేశంలోని ప్రధాన నగరాల్లో హడల్. రామ్జీనగర్ గ్యాంగ్ పేరు వింటేనే దేశంలోని ప్రధాన నగరాల్లోని పోలీసులకు తమిళనాడు తిరుచ్చిలో గల రామ్జీనగర్ గుర్తుకు వస్తుంది. సంజీవ్ అలియాస్ సంజూ నాయకత్వంలోని వందల మంది సభ్యులు ఈ ముఠాలో పనిచేస్తూ దృష్టి మరల్చి నేరాలకు పాల్పడుతుంటారు.
ఈ తరహాలోనే హైదరాబాదులోని ఆబిడ్స్ పోలీసు స్టేషన్ పరిధిలో గత కొద్ది రోజులుగా మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో సిసి టీవీ ఫుటేజీల ఆధారంగా ఆబిడ్స్ పోలీసులు రామ్జీ గ్యాంగ్కు చెందిన ముగ్గురు సభ్యులను గురువారం రాత్రి పట్టేశారు.
రామ్జీ ముఠా హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, కోల్కతా తదితర నగరాలు, పట్టణాల్లో ప్రజల దృష్టిని మరల్చి నేరాలకు పాల్పడింది. ఆబిడ్స్ పోలీసులు అప్రమత్తమై సిసి టీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితుల కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం రాత్రి ఏడున్నర గంటల సమయంలో ఆబిడ్స్లోని హాలీవుడ్ ఫుట్వేర్ సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
దాంతో గుట్టురట్టయింది. వారు ముగ్గురు రామ్జీ ముఠా సభ్యులని తేలింది. గత మూడు నెలల్లో ఈ ముఠా సభ్యులు హైదరాబాదులోని ఆబిడ్స్లో మూడు, పంజగుట్టలో రెండు, సైఫాబాద్లో ఒకటి, మహంకాళిలో ఒక్కటి, నారాయణగూడాలో ఒకటి చొప్పున మొత్తం 8 అటెన్షన్ డైవర్షన్ కేసుల్లో నిందితులని నిర్ధారించారు. వారు రూ. 15 లక్షల మేరకు సొత్తును దోచుకున్నట్లు తేలింది.
అరెస్టయినవారిని రామ్జీ ముఠాకు చెందిన పృథ్వీరాజ్ (38), పి. శశికుమార్ (21), గుణసలెన్ నాగార్జున్ (20)లుగా గుర్తించారు. వీరంతా తమిళనాడుకు చెందినవారే. మరో ముగ్గురు నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.
రామ్జీ ముఠాకు చెందిన సభ్యులను హైదరాబాదు పోలీసులు పదేళ్ల క్రితం అరెస్టు చేశారు. మరోసారి ఇప్పుడు ఆ ముఠా సభ్యులు హైదరాబాదులో తేలారు.