Huzurabad : కేసీఆర్ పరిశీలనలో అనూహ్య పేరు-ఈటలపై పోటీకి ఆ పోలీస్ అధికారిని దింపుతారా..?
హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరన్నది ఇంకా తేలలేదు. ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన నాటి నుంచే అభ్యర్థి కోసం అన్వేషణ సాగుతున్నా... ఇప్పటికీ అది ఓ కొలిక్కి రాలేదు. సీఎం పరిశీలనలో ఉన్నట్లు ఇప్పటివరకూ పలువురి పేర్లు వినిపించినప్పటికీ... కేసీఆర్ అంతగా సంతృప్తి చెందట్లేదని తెలుస్తోంది. సంచలనాలు,అనూహ్య నిర్ణయాలతో అంచనాలను తలకిందులు చేసే కేసీఆర్... ఈసారి కూడా అదే పంథాను అనుసరించబోతున్నారా అన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా తెర పైకి అనూహ్యంగా మరో పేరు వచ్చి చేరింది.
గతంలో జమ్మికుంట సీఐగా పనిచేసిన ప్రశాంత్ రెడ్డి పేరును సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుతో ఇప్పటికే ప్రశాంత్ రెడ్డి బయోడేటాను కేసీఆర్ తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. ప్రభాకర్ రావుతో ప్రశాంత్ రెడ్డి భేటీ కూడా అయినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

సీఐ ప్రశాంత్ స్వగ్రామం హుజురాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ గ్రామం. పుట్టి పెరిగిన నేపథ్యంతో పాటు జమ్మికుంటలో కొంతకాలం పోలీస్ అధికారిగా పనిచేయడంతో... హుజురాబాద్ నియోజకవర్గంలో ఆయనకు విస్తృత సంబంధాలు ఉన్నాయి. రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడం... జమ్మికుంట పరిసర ప్రాంత యువతలో ప్రశాంత్ రెడ్డికి మంచి క్రేజ్ ఉండటం సానుకూలంశాలుగా కనిపిస్తున్నాయి.
రెండేళ్ల క్రితం ఆగస్టు 15, 2017న జమ్మికుంటలో నిత్య జాతీయ గీతాలపనకు శ్రీకారం చుట్టింది సీఐ ప్రశాంత్ రెడ్డే. యువతలో దేశభక్తిని పెంపొందించాలన్న ఉద్దేశంతో ఆయన దీనికి అంకురార్పణ చేశారు. అప్పటినుంచి జమ్మికుంటలో ప్రతీ నిత్యం జాతీయ గీతాలపన సాగుతూనే ఉంది. సీఐ ప్రశాంత్ రెడ్డి అక్కడినుంచి బదిలీ అయిన ఆ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. నిత్య జనగణమన ఆలాపనతో రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలోనూ జమ్మికుంట ఆదర్శవంతంగా,స్పూర్తివంతంగా నిలిచింది. జమ్మికుంట స్పూర్తితో ఆ తర్వాత రాష్ట్రంలోని పలు గ్రామాల్లోనూ జాతీయ గీతాలపన ప్రారంభమైంది.

బీజేపీ తరుపున పోటీ చేస్తున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ను ఎదుర్కోవడంలో ప్రశాంత్ రెడ్డికి ఉన్న ఇమేజ్ ఎంతమేర పనిచేస్తుందని సీఎం కేసీఆర్ అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ పరిశీలనలో మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి కుటుంబం నుంచి ఆయన సతీమణి మాలతి,కుమారుడు కశ్యప్ రెడ్డి,సోదరుడైన మాజీ ఐఏఎస్ ప్రదీప్ చంద్ర,టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్,బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్ పేర్లు ఉన్నప్పటికీ.. సీఎం అంతగా సంతృప్తి చెందట్లేదన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే అనూహ్యంగా సీఐ పింగిళి ప్రశాంత్ రెడ్డి పేరు తెర పైకి వచ్చింది. మరి ప్రశాంత్ రెడ్డికి సీఎం కేసీఆర్ హుజురాబాద్లో పోటీ చేసే ఛాన్స్ ఇస్తారో లేదో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications