సభకొచ్చే వారిని వెనక్కి పంపిస్తారా? ఇదేం పనయ్యా?? పోలీసులపై సీఎం ఆగ్రహం
వరంగల్ టీఆర్ఎస్ సభకు తరలివచ్చిన వాహనాల్లో చాలా వాటిని మార్గం మధ్య నుంచే వెనక్కి పంపించటంపై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పోలీసు ఉన్నతాధికారులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
హైదరాబాద్: వరంగల్లో గురువారం నిర్వహించిన టీఆర్ఎస్ 16వ వార్షికోత్సవ సభకు తరలివచ్చిన వాహనాల్లో చాలా వాటిని మార్గం మధ్య నుంచే వెనక్కి పంపించటంపై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పోలీసు ఉన్నతాధికారులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
హైదరాబాద్ నుంచి గురువారం సాయంత్రం వరంగల్ సభకు వస్తున్న మంత్రులు కేటీఆర్, జి.జగదీశ్రెడ్డికి చాలా వాహనాలు.. వెనక్కి తిరిగి వెళ్లటం కనిపించింది. అలా వెనక్కి ఎందుకు వెళ్తున్నారంటూ వారు పార్టీ నాయకులు, కార్యకర్తలను వాకబు చేయగా, పోలీసులే తమను వెనక్కి పంపిస్తున్నారన్న సమాధానం వచ్చింది.
వరంగల్లోని సభా ప్రాంగణం నిండిపోయిందని, నగరం వాహనాలతో బ్లాక్ అయ్యిందంటూ సభకు వెళ్లే వాహనాలను పోలీసులు వెనక్కి పంపిస్తున్నట్లు తేలింది. దీంతో మంత్రులిద్దరు విస్తుపోయినట్లు సమాచారం.
అలాగే సీఎం కేసీఆర్ కూడా హైదరాబాద్ నుంచి వరంగల్కు హెలికాప్టర్లో వస్తూ గగనతలం నుంచి సభ ప్రాంగణం చుట్టుపక్కల పరిస్థితిని పరిశీలించారు. చాలా వాహనాలు సభా ప్రాంగణానికి 10-12 కిలోమీటర్ల దూరంలో నిలిచి ఉండటాన్ని ఆయన గుర్తించినట్లు తెలిసింది.
ఈ క్రమంలో వివిధ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు పోలీసుల సమన్వయం లోపం వల్లనే ఇదంతా జరిగినట్లు నిర్ధారించుకున్న సీఎం.. పోలీస్ ఉన్నతాధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
సభకు తరలి వచ్చిన వారిలో 60 శాతం మంది మాత్రమే ప్రాంగణానికి చేరుకున్నారని, మిగిలిన 40 శాతం జనం అక్కడికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు ముఖ్యనేతలు అంచనాకు వచ్చారు. వారందరూ గనుక సభాస్థలికి చేరుకుని ఉంటే సభ ఇంకా గ్రాండ్ సక్సెస్ అయి ఉండేదంటూ అందరూ అభిప్రాయపడినట్లు సమాచారం.