తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే!! వైసీపీ, టీఆర్ఎస్ స్నేహం..
తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పాలంటుంది విదురనీతి. కానీ తమ్ముడు తనవాడైనా, తనవాడు కాకపోయినా మనకు సంబంధం లేదంటుంది రాజకీయ నీతి. రాజకీయమే ముఖ్యమని చెబుతుంది. ఆచరించి చూపమంటుంది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకానీ, తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి మధ్య కానీ కొనసాగుతున్న స్నేహం ఈ కోవలోకే వస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
టీఆర్ఎస్ కు వైసీపీ మద్దతిచ్చే అవకాశం లేదు?
పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2019 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఏవిధంగా తన రాష్ట్ర హక్కుల కోసం, హోదా కోసం పోరాడిందో అలాగే తెలంగాణ రాష్ట్ర సమితి పోరాటానికి సిద్ధమైంది. రాష్ట్రానికి రావల్సిన నిధులను రానివ్వకుండా, పన్నుల్లో వాటా ఇవ్వకుండా తెలంగాణను ఆర్థికంగా అలజడికి గురిచేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీలకు వివరించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావల్సిన అన్ని హామీలపై గట్టిగా పట్టు పట్టాల్సిందేనంటూ ఎంపీలకు దిశానిర్దేశం చేసి పంపించారు.
సమావేశాలకు అడ్డు తగిలే అవకాశం?
కేసీఆర్ మాట ప్రకారం ఎంపీలు లోక్సభ, రాజ్యసభ సమావేశాలు సజావుగా సాగకుండా అడ్డు తగిలే అవకాశం కనపడుతోంది. అయితే టీఆర్ఎస్కు మద్దతిచ్చేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఏ పార్టీ ముందుకు వచ్చే అవకాశం కనపడటంలేదు. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ నుంచి టీఆర్ఎస్ మద్దతు ఆశిస్తోంది. కానీ ఆ పార్టీ కూడా నిరసనల్లో టీఆర్ఎస్తో కలిసే అవకాశం కనపడటంలేదు. కేంద్రంతో సన్నిహితంగా మెలుగుతూ రాష్ట్రానికి కావల్సిన నిధులు, ప్రాజెక్టులు తెచ్చుకుంటున్నామని వైసీపీ ఎంపీలు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి జగన్ దూరం
బీజేపీపై తీవ్రస్థాయిలో పోరాటం చేస్తున్న టీఆర్ఎస్కు వైసీపీ నుంచి మద్దతు లభించడం కష్టమని సీనియర్ రాజకీయవేత్తలు సైతం అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ప్రత్యర్థి కాబట్టి ఆవైపు నుంచి స్పందన ఉండదు. ప్రస్తుతానికి కేసీఆర్ తో ముఖ్యమంత్రి జగన్ దూరంగా ఉండే అవకాశమే ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
చంద్రబాబుకు గతంలో ఏ తరహా అనుభవం ఎదురైందో అదేతరహా అనుభవం కేసీఆర్కు ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతానికి కేసీఆర్తో దూరంగా ఉండటమనేది జగన్ వ్యూహంగా ఉందని, ఆ ప్రకారమే ఆయన అడుగులు వేస్తున్నారని భావిస్తున్నారు.