ఏపీ-టీలకు చెంపపెట్టు: పొంగులేటి, బిసిలను అణగదొక్కే కుట్ర: పొన్నం
హైదరాబాద్: రైతు ఆత్మహత్యల పైన హైకోర్టు వ్యాఖ్యలు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు చెంప పెట్టు అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి మంగళవారం హైదరాబాదులో అన్నారు. రైతు ఆత్మహత్యలపై ఉన్నత కమిటీ వేసి కారణాలు అన్వేషించాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఆయన సూచించారు.
రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రణాళికలు రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేసి ఆదుకోవాలన్నారు. ఆత్మహత్యలు నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు.
ముఖ్యమంత్రి కెసిఆర్కు యాగాల పైన ఉన్న దృష్టి పాలన పైన లేదన్నారు. తన శ్రద్ధను ఫిరాయింపుల పైన కాకుండా పాలన పైన పెట్టాలని కెసిఆర్కు సూచించారు. ప్రతిపక్షం పైన అధికార దాహంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్రిమిలేయర్ విషయమై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తెరాస పైన మండిపడ్డారు. క్రిమిలేయర్ పేరుతో బిసిలను అణగదొక్కేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు.
సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత : ఈటెల
సంక్షేమమే తమ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత అని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. హోటల్ తాజ్ కృష్ణలో జరిగిన నాబార్డ్ స్టేట్ క్రెడిట్ సెమినార్లో ఈటెల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కుల వృత్తుల మీద ఆధారపడ్డ వారిని ఆదుకుంటామన్నారు.
మిషన్ భగీరథతో ఇంటింటికీ మంచినీరు, మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరిస్తున్నామన్నారు. రాబోయే నాలుగేళ్లలో 46 వేల చెరువులను పునరుద్ధరిస్తామన్నారు. ప్రభుత్వం వ్యవసాయానికి ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు.
మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఇరిగేషన్ ప్రాజెక్టులకు నాబార్డు సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇక అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. రైతులు, కుల వృత్తిదారులకు ఆర్బీఐ, బ్యాంకులు లోన్లు ఇచ్చి ఆదుకోవాలన్నారు.