ఎట్ హోంలో అలాంటి పవన్ కళ్యాణ్తో కేసీఆర్ చర్చలా?, అప్పుడే విమర్శలు
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ వ్యతిరేకి అని, అలాంటి వ్యక్తితో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాట్లాడటం ఏమిటని కాంగ్రెస్ పార్టీ నేత, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆదివారం ప్రశ్నించారు. రాజ్భవన్ అప్రజాస్వామిక చర్యలకు వేదికగా మారిందని ఆరోపించారు.
కారు గుర్తువల్లే ఓడిపోయా, దానిని తొలగించండి: టీఆర్ఎస్కు గద్వాల అభ్యర్థి షాక్
తెలంగాణ వ్యతిరేకి
తెలంగాణను వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్తో కేసీఆర్ ఎలా చర్చలు జరుపుతారని పొన్నం నిలదీశారు. ఇలాంటి చర్యలతో రాజ్భవన్కు ఉన్న విలువను తగ్గిస్తున్నారన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్నారు. టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి ఎందుకు వచ్చిందా? అని ప్రజలు బాధపడుతున్నారన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం రాజ్ భవన్లో ఏర్పాటు చేసిన ఎట్ హోమ్ కార్యక్రమంలో కేసీఆర్, కేటీఆర్లు పవన్తో మాట్లాడిన విషయం తెలిసిందే.
మోడీ ఏజెంట్లా కేసీఆర్
ప్రధాని నరేంద్ర మోడీకి కేసీఆర్ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని పొన్నం విమర్శించారు. దేశం మొత్తం ఏకకాలంలో ఎన్నికలనే నినాదం ఎత్తుకున్న మోడీ...తెలంగాణలో మాత్రం కేసీఆర్ కోసమే ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు సహకరించారో చెప్పాలని ప్రశ్నించారు.
పవన్ - కేసీఆర్ భేటీను తప్పుబట్టడం సరైనదేనా
కేసీఆర్, కేటీఆర్, పవన్ కళ్యాణ్ భేటీలో పలు రాజకీయ అంశాలు చర్చకు వచ్చి ఉంటాయని చాలామంది భావిస్తున్నారు. ఏపీ రాజకీయాలు, కేసీఆర్ థర్ట్ ఫ్రంట్, ఏపీ ఎన్నికల్లో జనసేన పోటీ, బలోపేతం తదితర అంశాలపై చర్చించి ఉంటారని భావిస్తున్నారు. అలాగే పొత్తులు, థర్డ్ ఫ్రంట్లో పవన్ చేరిక అంశంపై కూడా చర్చించి ఉంటారని భావిస్తున్నారు. ఈ విషయాన్ని పక్కన పెడితే ఓ వేదిక పైన అన్ని పార్టీల వారు ఉన్నారని, కలిసినప్పుడు మాట్లాడుకోవడం సాధారణమేనని, దీనిని కూడా తప్పుపట్టడం విడ్డూరంగా ఉందని కొందరు ఎద్దేవా చేస్తున్నారు. అలా అయితే కేసీఆర్.. జానారెడ్డిని కౌగిలించుకున్నారని, మల్లుభట్టిని పిలిచి మరీ పవన్కు చెప్పారని అంటున్నారు. గవర్నర్ ఇచ్చిన విందులో సాధారణంగా మాట్లాడుకుంటే దానికి చర్చలు ముద్ర వేయడం, దానిని తప్పుపట్టడం విడ్డూరమంటున్నారు. అంతేకాదు, పవన్ తెలంగాణను వ్యతిరేకించలేదని, ఇక్కడి ప్రజల ఆవేదన కారణంగానే ఉద్యమం జరిగిందని పలుమార్లు చెప్పారని, అంతేకాకుండా, ఆయన ఏపీ నేతలను తప్పుబట్టారని గుర్తు చేస్తున్నారు.