ప్రజాకూటమి నేతలు ఇడియట్లు...కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు
కాంగ్రెస్ మహాకూటమి ఇడియట్లు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం కేసీఆర్. ఘోర పరాజయం చవిచూసినప్పటికీ ఇంకా తమ పొగరు అనగలేదని చెప్పారు కేసీఆర్.ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో తన వంతు ప్రయత్నం విజయవంతంగా చేసి తిరిగి హైదరాబాదు వచ్చిన సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బీసీ రిజర్వేషన్లపై మాట్లాడారు. చేనేత కార్మికుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేసింది టీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పిన ఆయన వారి జీవితాల్లో వెలుగులు నింపామని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇష్టానుసారంగా మాట్లాడటం బాధాకరమని చెప్పారు.
రిజర్వేన్లను అడ్డుకున్నది కాంగ్రెస్ వారే
వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికలకంటే పంచాయతీ ఎన్నికలే ముందు నిర్వహించాలని భావించినట్లు కేసీఆర్ చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ పెంచుతూ కొత్త చట్టం తీసుకొచ్చామని దీని ప్రకారం బీసీలకు 61.9శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చట్టంలో పొందుపర్చామని చెప్పారు. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన స్వప్నారెడ్డి, గోపాల్రెడ్డిలు కోర్టును ఆశ్రయించి అడ్డుకున్నారని చెప్పారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం మాత్రమే రిజర్వేషన్లు ఉండాలని హైకోర్టు తెలిపిందని చెప్పారు. అయితే అక్కడితో ఆగకుండా సుప్రీం కోర్టును ఆశ్రయించామని చెప్పిన కేసీఆర్ ... రిజర్వేషన్లు పెంచడం సాద్యం కాదని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పినట్లు చెప్పారు. ఇక తప్పని పరిస్థితుల్లో జనవరి 10లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని అన్నారు. లేకుంటే కోర్టు ధిక్కారణ అవుతుందని చెప్పారు కేసీఆర్. బీసీలకు మేలు చేసింది నాటి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మాత్రమే అని అన్నారు.
మార్కెట్ కమిటీల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వమే
మార్కెట్ కమిటీలో బీసీ రిజర్వేషన్ అమలు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదని చెప్పిన కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రం ఇలా అమలు చేయలేదని చెప్పారు. బీసీలను నాశనం చేసిందే కాంగ్రెస్ టీడీపీలని మండిపడ్డారు కేసీఆర్. విపక్షాలు విషం చిమ్ముతున్నాయని ధ్వజమెత్తారు సీఎం. హైదరాబాదులో అన్ని వర్గాల వారికీ ఆత్మగౌరవ భవనాలు నిర్మించి తీరుతామని ఈ సందర్భంగా కేసీఆర్ హామీ ఇచ్చారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తోందని ఫైర్ అయ్యారు. బీజేపీ ఇప్పటికీ టీఆర్ఎస్ను విమర్శిస్తోందని చెప్పిన కేసీఆర్... ఎన్నికల్లో బీజేపీ 118 చోట్ల పోటీ చేస్తే 103 చోట్ల డిపాజిట్ కోల్పోయిందన్నారు.
మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచింది ఈవీఎం ట్యాంపరింగ్తోనేనా..?
ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపణలు పసలేనివని కొట్టిపారేశారు కేసీఆర్. ఓటమిని అంగీకరించలేని వాడు నాయకుడే కాదని అన్నారు. అంతేకాదు ఉత్తమ్కుమార్ రెడ్డి సెన్స్లెస్ లీడర్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచినప్పుడు అక్కడ కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా అని ప్రశ్నించారు. విపక్షనేతలు ఇష్టాను సారంగా మాట్లాడటం మానుకుంటే మంచిదని హితవు పలికారు కేసీఆర్.