కేసీఆర్ బీఆర్ఎస్ ఆవిర్భావసభలో కనిపించని ప్రకాష్ రాజ్, కుమారస్వామి.. ఆసక్తికర చర్చ
తెలంగాణ సీఎం కేసీఆర్ అత్యంత అట్టహాసంగా నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో మూడు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంతమాన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సీఎం కేసీఆర్ తో పాటు టిఆర్ఎస్ ఆవిర్భావ సభలో పాల్గొని కేంద్రంలోని బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కూడా పాల్గొని వచ్చే ఎన్నికలలో బిజెపిని తరిమికొట్టాలంటూ పిలుపునిచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఖమ్మం బీఆర్ఎస్ సభలో జెడిఎస్ నేత కుమారస్వామి, అలాగే కెసిఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉంటున్న ప్రకాష్ రాజ్ కనిపించలేదు. ప్రస్తుతం ఇదే విషయం రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది.
బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కనిపించని జేడీఎస్ నేత కుమారస్వామి
కెసిఆర్ జాతీయ పార్టీని ప్రకటించాలి అని భావించిన ప్రతి సందర్భంలోనూ, పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకొని తీర్మానం చేసినప్పుడు, ఈసీ నుండి అధికారికంగా బిఆర్ఎస్ పార్టీ ఏర్పాటుకు ఆమోదం వచ్చినప్పుడు, ఢిల్లీ కేంద్రంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించినప్పుడు జెడిఎస్ నేత కుమారస్వామి ప్రతి సమయంలోను వచ్చి వెళ్లారు. కానీ బిఆర్ఎస్ ఆవిర్భావ సభలో మాత్రం కుమారస్వామి కనిపించలేదు.
కేసీఆర్ సభకు కుమారస్వామి రాని కారణం ఏమిటి? ఆసక్తికర చర్చ
కుమారస్వామికి ఇతర కార్యక్రమాలు ఉండడం వల్ల రాలేకపోయారని బిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నప్పటికీ, కెసిఆర్ కు కుమారస్వామికి మధ్య పొర పచ్చాలు వచ్చాయా అన్న ఆసక్తికర చర్చ కూడా రాజకీయ వర్గాలలో సాగుతుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, అత్యంత కీలకంగా భావించిన, ఐదు లక్షల మందితో నిర్వహించిన ఆవిర్భావ సభకు ఆయన రాలేనంత ముఖ్యమైన కార్యక్రమాలు ఏమిటి అన్నది అందరూ చర్చిస్తున్నారు. ఒకవేళ తాను రాకపోతే తన తరపున పార్టీ ప్రతినిధిని ఎవరినైనా పంపేవారు కదా అన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది.
ప్రకాష్ రాజ్ బీఆర్ఎస్ సభకు ఎందుకు రాలేదు?
ఇక ఇదే సమయంలో సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉంటూ, కర్ణాటక రాజకీయాలలో కీలక భూమిక పోషిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన ప్రకాష్ రాజ్ కూడా బిఆర్ఎస్ ఆవిర్భావసభలో పాల్గొనలేదు. ప్రకాష్ రాజ్ ఎందుకు ఈ ఆవిర్భావ సభలో పాల్గొనలేదు అన్నది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక బీఆర్ఎస్ బాధ్యతలు ఆయనకు అప్పగిస్తారని ప్రచారం జరిగినప్పటికీ, ఇంకా సీఎం కేసీఆర్ ఈ వ్యవహారంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ బిఆర్ఎస్ సభకు రాకపోవడంపై ఆసక్తి నెలకొంది.
కర్ణాటక ఎన్నికల్లో పోటీపై ఇద్దరి మధ్య పొసగటం లేదని ప్రచారం.. నిజమెంతో ?
మరోవైపు సీఎం కేసీఆర్ కర్ణాటక రాష్ట్రంలో జేడీఎస్ కు పూర్తిస్థాయిలో మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటకలో ప్రచారం కూడా చేస్తామని ప్రకటన కూడా చేశారు. అయితే కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలలో బీఆర్ఎస్ పోటీ చేస్తుంది అని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇకపోతే ఎన్నికలకు వెళితే బీఆర్ఎస్ కర్ణాటకలో పోటీ చేయదని జెడిఎస్ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికలలో పోటీ చేసే అంశంపై రెండు పార్టీ నేతల మధ్య ఇంకా ఒక క్లారిటీ రాలేదని, ఇద్దరికీ పొసగలేదు అన్న ప్రచారం జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ జెడిఎస్ అధినేత కుమారస్వామి రాకపోవడం, ప్రకాష్ రాజ్ బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కనిపించకపోవడం మాత్రం రాజకీయంగా ప్రాధాన్యతను దక్కించుకున్నాయి.