పీఎం మోడీకి ప్రకాష్ రాజ్ చురకలు: ఆ ఫోటోలతో డియర్ సుప్రీంలీడర్ అంటూ టార్గెట్
తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ట్విట్టర్ వేదికగా తెలంగాణలో అద్భుత పాలన నడుస్తుంది అని చెబుతూ ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంలోని పాలనను చూసి నేర్చుకోవాలి అంటూ ప్రకాష్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
డియర్ సుప్రీం లీడర్ అంటూ ప్రకాష్ రాజ్ సెటైర్లు
మోడీ పేరు ప్రస్తావించకుండా హైదరాబాద్ వస్తున్న అత్యుత్తమ నాయకుడికి స్వాగతం అంటూ ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. డియర్ సుప్రీమ్ లీడర్ అంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన ప్రకాష్ రాజ్ బిజెపి పాలిత రాష్ట్రాలలో మోదీ పర్యటన సమయంలో ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన మొత్తం నుండి కోట్ల రూపాయలు ఖర్చు చేసి రోడ్లు వేసుకుంటారని పేర్కొన్నారు. కానీ ప్రజల అభివృద్ధి కోసమే తెలంగాణాలో డబ్బులు ఖర్చు చేస్తారని ప్రకాష్ రాజు తన తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.
మోడీ తెలంగాణాను చూసి నేర్చుకోవాలన్న ప్రకాష్ రాజ్
మోడీ తన తెలంగాణ రాష్ట్ర పర్యటనను ఆస్వాదించాలని, దూరదృష్టితో మౌలిక సదుపాయాలు ఎలా అందించాలో చూసి నేర్చుకోవాలి అంటూ సున్నితంగా చురకలంటించారు. తెలంగాణ రాష్ట్రంలో నీటి ప్రాజెక్టులు, యాదాద్రి ఆలయం, టీ హబ్ 2, ప్రభుత్వ ఆసుపత్రి, గురుకుల పాఠశాల భవనాలతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ తో కూడిన ఫోటోలను ఆయన ట్విట్టర్ వేదికగా షేర్ చేసి మోడీని టార్గెట్ చేశారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ హ్యాష్ ట్యాగ్ తో ఆయన ట్వీట్ చేశారు.
బీజేపీ పై ప్రకాష్ రాజ్ వ్యతిరేకత.. నిత్యం బీజేపీని టార్గెట్ చేస్తున్న నటుడు
ఇదిలా ఉంటే గత కొంతకాలంగా ప్రకాష్ రాజ్ బిజెపిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేంద్రంలోని బిజెపి సర్కార్ పై దేశంలోని ప్రజావ్యతిరేక విధానాలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ తో సన్నిహితంగా మెలుగుతున్న ప్రకాష్ రాజ్, టిఆర్ఎస్ పార్టీలో కీలక భూమిక పోషిస్తున్నారని పలువురు భావించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ కు తెలంగాణ నుంచి అవకాశం కల్పిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
కేసీఆర్ కు సన్నిహితంగా సినీనటుడు ప్రకాష్ రాజ్
తెలంగాణా సీఎం కెసీఆర్ ప్రశాంత్ కిషోర్, ప్రకాష్ రాజ్ లతో చర్చలు జరిపారు. మల్లన్న సాగర్, గజ్వేల్ లలో వివిధ అభివృద్ధి పనులను ప్రశాంత్ కిషోర్ తో కలిసి ప్రకాష్ రాజ్ పరిశీలించారు. ప్రకాష్ రాజ్ తో అనేక దఫాలుగా తెలంగాణ సీఎం కెసిఆర్ భేటీ నిర్వహించిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలలోనూ ప్రకాష్ రాజ్ పై ఆసక్తికర చర్చ జరిగింది. ఇక ఈ క్రమంలో తాజాగా ప్రకాష్ రాజ్ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను టార్గెట్ చేయడం ప్రధానంగా కనిపిస్తుంది.