ఆ ఎమ్మెల్యేలను మార్చాల్సిందే - సీఎం కేసీఆర్ కు పీకే రిపోర్టు : టీఆర్ఎస్ కు కలిసొచ్చేది ఇలా..!!
తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ - రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సుదీర్ఘ మంతనాలు హాట్ టాపిక్ గా మారాయి. కాంగ్రెస్ లో చేరేందుకు ప్రశాంత్ కిషోర్ కు లైన్ క్లియర్ అయిందని భావిస్తున్న సమయంలో..ఇటు తెలంగాణలో పీకే రెండు రోజుల పాటుగా సీఎం కేసీఆర్ తో అనేక అంశాల పైన చర్చలు చేసారు. జాతీయ రాజకీయాలతో పాటుగా..తెలంగాణలో రాజకీయ పరిస్థితులు..అనుసరించాల్సిన వ్యూహాల పైన పలు ప్రతిపాదనలు వారిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో.. తాను కాంగ్రెస్లో చేరినా తన ఐప్యాక్ సంస్థ తెరాస కోసం యథాతథంగా పనిచేస్తుందని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలిపారు. ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ను కలుపుకొనివెళ్లే విషయంపై ఆలోచించాలని కోరారు.
అందరూ ఒక్కటవుతేనే సాధ్యం
కేంద్రంలో బీజేపీని ఓడించాలంటే వ్యతిరేకత శక్తులు అన్నీ ఒక్కటవుతేనే సాధ్యమని ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లుగా సమాచారం. అయితే, కేసీఆర్ మాత్రం తాము బీజేపీ..కాంగ్రెస్ తో సమదూరం పాటిస్తామని స్పష్టం చేసినట్లు తెలిసింది. జాతీయస్థాయిలో ఈ రెండు పార్టీలు లేకుండా ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక ఏర్పాటు సాధ్యమేనని ఆయన అన్నట్లు సమాచారం. భాజపాను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలనే లక్ష్యంతో ఆ పార్టీని ఎంచుకున్నానని పీకే పేర్కొన్నట్లు తెలిసింది.
తాను కాంగ్రెస్లో చేరినా తమ సంస్థ ఐప్యాక్ తెరాసకు రాజకీయ సలహా సేవలు కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా టీఆర్ఎస్ ..ఇతర పార్టీల బలాబలాలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలపై నిర్వహించిన సర్వే ఫలితాలను అందించారు.
ఆ ఎమ్మెల్యేలను మార్చాలని సూచనలు
కొందరు ఎమ్మెల్యేలపై ప్రజావ్యతిరేకత ఉందని జిల్లాల వారీగా నివేదికలు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీ అధినాయకత్వం వద్ద తమ పైన ఫిర్యాదులు..వ్యతిరేకత సమాచారం ఉందని తెలిసినా వారు మారడం లేదని, మరోసారి సిట్టింగులందరికీ సీట్లు వస్తాయనే ధైర్యంతో ఉన్నారని వివరించినట్లుగా తెలుస్తోంది.
అదే సమయంలో అటువంటి వారిని మార్చే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పినట్లుగా సమాచారం. కొందరు పార్టీ ఎమ్మెల్యేలు సొంత పార్టీ వారినే వేధిస్తున్నారనే అంశాన్ని సైతం పీకే తన నివేదికలో వివరించినట్లుగా తెలుస్తోంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఒక ప్రజాప్రతినిధి సొంత పార్టీ సర్పంచులు, ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు చేయిస్తూ, మరో పార్టీలోకి వెళ్లేలా ఒత్తిడి తెస్తున్నారని..ఇలాంటి పరిస్థితులను వివరించారు. తెలంగాణలో త్రిముఖ పోరు జరుగుతుందని, ఇది తెరాసకు లాభిస్తుందని పీకే తన నివేదికల్లో నివేదించినట్లు సమాచారం.
ఆ రెండు పార్టీల పోరే టీఆర్ఎస్ కు బలం
కాంగ్రెస్ - బీజేపీ పోరు టీఆర్ఎస్ కు కలిసి వస్తుందని లెక్కలు వేసారు. రాష్ట్రంపైన బీజేపీ వివక్ష చూపుతోందని..విభజన హామీలను నెరవేర్చడంలో వైఫల్యంతో పాటు ప్రతి అంశంలోనూ నిర్లక్ష్యంగా ఉందనే వాదన ప్రజల్లోకి బలంగా వెళ్లిందనే అభిప్రాయం వ్యక్తం అయింది. దీనిని మరింత సమర్ధవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు.
ఇదే సమయంలో ప్రచార సరళిలో మార్పుల పైన చర్చించినట్లు తెలుస్తోంది. కొత్త ఓటర్ల సంఖ్య భారీగా పెరుగుతున్న వేళ.. వారిని ఆకట్టుకోవటం కోసం ప్రత్యేక వ్యూహాలు అందించినట్లు సమాచారం. అందుల కోసం ఎప్పటికప్పుడు ప్రచార శైలి మార్చేందుకు ఐ ప్యాక్ నుంచి సహకారం అందించేందుకు పీకే - సద్వినియోగం చేసుకొనేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయానికి వచ్చారు.
ప్రచార సరళిలో కొత్త మార్పులు
ఇక నుంచి నిరంతరం సర్వేలతో పాటుగా సంక్షేమ -అభివృద్ధి కార్యక్రమాల పైన మరింత కొత్త వేదికల ద్వారా ప్రచారం చేయాలని డిసైడ్ అయ్యారు. తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ పాత్ర పట్ల కొత్త ఓటర్లను ప్రభావితం చేసేలా వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం చేసే అంశంపై చర్చించారు.
జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటమి, లేదా పార్టీ ఏర్పాటుపై లోతుగా అధ్యయనం చేసారు. త్వరలోనే మరోసారి సీఎం కేసీఆర్.. ప్రశాంత్ కిషోర్ భేటీ ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో..ఈ నెల 27న పార్టీ ప్లీనరీ వేదికగా సీఎం కేసీఆర్ కీలక అంశాలు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.