మునుగోడులో కేసీఆర్ కు షాకిచ్చిన ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ నివేదిక.. గులాబీనేతల్లో గుబులు!!
మునుగోడు అసెంబ్లీ స్థానానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక ఈ నేపథ్యంలో మునుగోడులో పాగా వేయడానికి రాజకీయ పార్టీలు ఎవరికి వారు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఈసారి ఉప ఎన్నికలో అయినా గులాబీ పార్టీ సత్తా చాటాలని టిఆర్ఎస్ పార్టీ నేతలు పక్కా ప్లాన్ తో ముందుకు వెళుతున్నారు.

మునుగోడుపై టీఆర్ఎస్ దృష్టి .. వలసలపై ఫోకస్
ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ మునుగోడు అసెంబ్లీ స్థానంలో జెండా ఎగురవేయాలని కసరత్తు ప్రారంభించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డికి మునుగోడును హస్తగతం చేసుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఇక ఇదే సమయంలో మునుగోడులో మండలాల వారీగా టీఆర్ఎస్ పార్టీకి ఉన్న బలమైన నేతలకు సంబంధించిన డేటాని కూడా సిద్ధం చేసుకున్నారు. ఇతర పార్టీల నుండి టీఆర్ఎస్ పార్టీలోకి వలసలను కూడా ఈ సమయంలో స్వాగతిస్తే పార్టీ బలం పెరుగుతుంది అన్న అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.

టీఆర్ఎస్ పార్టీకి టెన్షన్ పుట్టిస్తున్న ఐప్యాక్ సర్వే
ఇదిలా ఉంటే ఇటీవల టిఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ టీం ఐప్యాక్ చేసిన సర్వే మాత్రం టిఆర్ఎస్ పార్టీ కి టెన్షన్ పుట్టిస్తుంది. మునుగోడు నియోజకవర్గంలో స్థానికంగా టిఆర్ఎస్ పార్టీలో పరిస్థితులు పెద్దగా బాగోలేదని ఐప్యాక్ సర్వే నివేదిక అందించింది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ బలాబలాలు, పార్టీ అభ్యర్థిగా ఎవరైతే మెరుగు అన్న అంశంతో పాటు పలు అంశాలను అందులో ప్రస్తావించారు. ఇక పార్టీలో నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు పరిష్కరించాల్సిన అవసరాన్ని కూడా సర్వే నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు.

పార్టీ నేతల మధ్య విబేధాలు .. మునుగోడులో కొనసాగుతున్న సర్వేలు
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కర్నె ప్రభాకర్, కర్నాటి విద్యాసాగర్, నారబోయిన రవి కుమార్ ల మధ్య విభేదాలు ఉన్నట్టు ఆ నివేదికలో వెల్లడించారు. ఇక ఇప్పుడు ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీలో అంతర్గతంగా ఉన్న విభేదాలను దిద్దుబాటు చేయాల్సిన అవసరం గులాబీ అధినేతకు వచ్చింది. పార్టీని గాడిలో పెట్టడంతో పాటు, ప్రత్యర్థి పార్టీలను దీటుగా ఎదుర్కోవడంపై కెసిఆర్ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత ఉపఎన్నిక వాతావరణం నేపథ్యంలోనూ మునుగోడు నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా అభ్యర్థి ఎవరు అయితే విజయం సాధిస్తారు అన్న అంశంపై టీఆర్ఎస్ పార్టీ ఐప్యాక్ సంస్థ తో పాటు మరికొన్ని సంస్థలతో సర్వేలు చేయిస్తోంది.

సర్వేల ఫలితాల తర్వాతే అభ్యర్థి ఎంపిక.. గులాబీలలో మునుగోడు గుబులు
అభ్యర్థి ఎంపిక ఈ సర్వేల ద్వారా వెల్లడయ్యే ఫలితాల ఆధారంగా చేస్తారని తెలుస్తోంది. హుజరాబాద్ ఉపఎన్నికలో విజయం సాధించాలని కెసిఆర్ ఎంత ప్రయత్నం చేసినా హుజురాబాద్ లో టిఆర్ఎస్ పార్టీకి బిజెపి గట్టి దెబ్బ కొట్టింది. ఈసారి అలాంటి పరిస్థితి రిపీట్ కాకుండా అత్యంత జాగ్రత్తగా అభ్యర్థిని ఎంచుకోవాలని, చిన్నతప్పుకు కూడా అవకాశం లేకుండా జాగ్రత్త వహించాలని టిఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలోనే నియోజకవర్గంపై పెద్ద ఎత్తున సర్వేలను నిర్వహిస్తోంది. గెలుపు గుర్రానికి ఈసారి టికెట్ ఇవ్వాలని టిఆర్ఎస్ బలంగా నిర్ణయించింది. బయటకు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా, అంతర్గతంగా మాత్రం టిఆర్ఎస్ పార్టీలో మునుగోడు ఉప ఎన్నికపై ఆందోళన కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications