కేసీఆర్ కు ప్రశాంత్ కిషోర్ సంచలన రిపోర్ట్ - వారిపై వేటు వేయండి : ప్రతికూలత- బీజేపీ బలం పైనా..!!
తెలంగాణలో టీఆర్ఎస్ ముచ్చటగా మూడో సారి అధికారంలో కొనసాగాలంటే ఏం చేయాలి. క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఏంటి. బీజేపీ ప్రభావ ఎంత. ఇటువంటి అంశాల పై తాజాగా ప్రశాంత్ కిషోర్ టీం ఇచ్చిన నివేదిక రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది. అధికారంలో కొనసాగుతామని ధీమా వ్యక్తం చేస్తోంది. తాజాగా జరిగిన పార్టీ సమావేశంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజా సర్వేల అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పటి వరకు 30 సీట్లలో సర్వే ఫలితాలు వస్తే అందులో 29 తమకే అనుకూలంగా వచ్చాయని చెప్పుకొచ్చారు. ముందస్తు ఎన్నికల ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
Recommended Video
ఇదే సమయంలో ఈ సారి కేసీఆర్ తెలంగాణలో ప్రశాంత్ కిషోర్ టీం సేవలను వినియోగించుకుంటున్నారు. తనకు ప్రశాంత్ కిషోర్ తో ఏడేళ్ల కాలంగా అనుబంధం ఉందని..ఆయన డబ్బులు తీసుకొని పని చేయరని చెప్పారు. జాతీయ స్థాయిలో పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా..కలిసి పని చేస్తున్నామని స్పష్టం చేసారు.
పార్టీ కింది స్థాయిలో సమన్వయ లోపం
ఇదే సమయంలో ప్రశాంత్ కిషోర్ టీం తెలంగాణలో టీఆర్ఎస్ మరోసారి అధికారంలో కొనసాగాలంటే ప్రస్తుత పరిస్థితులు..తీసుకోవాల్సిన చర్యలు.. ప్రజాభి ప్రాయం పైన ఒక కీలక నివేదిక సమర్పించినట్లుగా తెలుస్తోంది. అందులో పలు కీలక అంశాలు స్పష్టంగా పేర్కొన్నట్లు సమాచారం. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ పని తీరు అనేక కోణాల్లో ప్రజాభిప్రాయాన్ని గుర్తించే విధంగా టీం వ్యవహరించింది.
పార్టీ ఏర్పాటు నుంచి సిన్సియర్ గా పార్టీ కోసమే పని చేస్తున్న వారికి గుర్తింపు లేదనే అభిప్రాయం ఉందని నివేదికలో పేర్కొన్నారు. పార్టీ రెండు సార్లు అధికారంలోకి వచ్చినా..తమకు గుర్తింపు ఇవ్వక పోవటం పైన వారు ఆవేదనతో ఉన్నట్లుగా సీఎంకు నివేదించారు.
ఇక, ఇతర పార్టీల నుంచి పలు సందర్భాల్లో టీఆర్ఎస్ లో చేరిన నాయకుల మధ్య సమన్వయం కనిపించటం లేదని..ఇది ఇబ్బందులకు కారణమవుతుందని తేల్చింది. కొంత మంది ఎమ్మెల్యేల తీరు పైన ఈ నివేదికలో స్పష్టత ఇచ్చారు.
కొందరు ఎమ్మెల్యేల తీరు పై వ్యతిరేకత
ప్రభుత్వ పాలన పైన సానుకూలత వ్యక్తం అవుతున్నా.. కొందరు స్థానిక ఎమ్మెల్యేల వైఖరి పైన ప్రజల్లో ఆగ్రహం ఉన్నట్లుగా గుర్తించారు. వివాదాల్లో దూరటం.. సంబంధం లేని విషయాల్లో జోక్యం..కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వకపోవటం.. కొన్ని చోట్ల ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు ఇష్టానుసారం వ్యవహరించటం ప్రజల్లో వారి పట్ల వ్యతిరేకత పెంచేలా ఉన్నాయని నివేదికలో స్పష్టం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
ఇక, మంత్రుల పని తీరుపైనా సర్వేలో పలు అంశాలు ప్రస్తావించారు. కొందరు మంత్రులు ఇప్పటికీ తమ శాఖలపైన పూర్తిగా పట్టు సాధించలేదని..అధికారుల పైనే ఆధార పడుతున్నారని..ఇది అధికారులకు అవకాశంగా మారుతోందని నివేదికలో పేర్కొన్నారు. తొలి నుంచి పార్టీ కోసమే పని చేస్తున్న కేడర్ ను పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు పట్టించుకోవటం లేదని.. ప్రజలకు సైతం అందుబాటులో లేకపోవటం వారి పైన వ్యతిరేకతకు కారణమవుతోందని స్పష్టం చేసారు. సమర్ధవంతంగా పని చేయలేక పోతున్న ఎమ్మెల్యేల జాబితా సైతం సీఎంకు అందించినట్లుగా తెలుస్తోంది.
యువతను ఆకట్టుకొనే నిర్ణయాలు కావాలి
వీరి పని తీరు సరి చేసుకొనేలా చూడటం..లేదా వీరి పైన అంతిమంగా వేటు వేయటం చేయకుంటే నష్టం తప్పదని నివేదికలో పీకే టీం స్పష్టం చేసింది. ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీలో జరిగిన తాత్సారం ప్రభుత్వంపై కొంత ప్రతికూల ప్రభావం చూపిందని పీకే నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం చేపట్టిన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఏడాదిలోపు పూర్తి చేయాలని నివేదిక సూచించింది.
జిల్లాలు, జోన్ల విభజనతో కొందరు ఉద్యోగుల్లో ఏర్పడిన అసంతృప్తిని తొలగించేందుకు ప్రమోషన్లు, ఇతర సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని సూచించింది. ఇక, బీజేపీ బలం - బలహీనతల గురించి నివేదికలో వివరించారు. బీజేపీ ప్రభుత్వం పైన వ్యతిరేకత పెంచేలా ప్రధానంగా సోషల్ మీడియాను వేదికగా మలచుకుందని.. దీనిని తిప్పి కొట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది.
బీజేపీ అందులో ముందుంది.. తిప్పి కొట్టగలిగితేనే
ప్రధానంగా యువతను ఆకట్టుకొనే ప్రయత్నాలు బీజేపీ నుంచి కనిపిస్తున్నాయని..వెంటనే ఉద్యోగాల భర్తీ పూర్తి చేయాలని సర్వేలో సీఎంకు సూచించినట్లు సమాచారం. బీజేపీ శ్రేణులు చేస్తున్న ప్రచారాన్ని అడ్డుకునేందుకు యువత, విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించింది. కొత్త ఓటర్లు, యువతను బీజేపీ ఆకట్టుకొనే వ్యూహాలు అమలు చేస్తుందని..దీనికి కౌంటర్ గా టీఆర్ఎస్ చెక్ పెట్టే నిర్ణయాలు అమలు చేయాలని నివేదికలో స్పష్టం చేసింది. దీంతో..మొత్తంగా టీఆర్ఎస్ కు సానుకూల వాతావరణం ఉన్నా.. ప్రతికూలతను అధిగమిస్తూ పక్కా వ్యూహాత్మకంగా వెళ్లాల్సిన అవసరం.. మార్గాలను ఈ నివేదికలో ప్రశాంత్ కిషోర్ టీం స్పష్టం చేయటంతో..ఇప్పుడు ప్రభుత్వం - పార్టీలో ఎటువంటి నిర్ణయాల దిశగా కేసీఆర్ అడుగులు వేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.