ఢిల్లీకి బయల్దేరిన ప్రణబ్: కేసీఆర్ మనవడి భుజంపై చెయ్యేసి నడిచిన గవర్నర్
హైదరాబాద్: నగరంలో శీతాకాల విడిది ముగించుకుని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం నుంచి గురువారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి హకీంపేట్ ఎయిర్ఫోర్స్ స్టేషన్ నుంచి ఢిల్లీకి బయల్దేరారు. ఈ సందర్భంగా ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.
హకీంపేటకు చేరుకుని వీడ్కోలు పలికిన వారిలో గవర్నర్ నరసింహాన్, సీఎం కేసీఆర్తో పాటు ఆయన మనవడు, ఐటీశాఖ మంత్రి కుమారుడు హిమాన్షు, పలువురు ప్రముఖులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు. ఈ సందర్భంగా ఈరోజు ఉదయం ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
రాష్ట్రపతి ప్రణబ్ వీడ్కోలు కార్యక్రమానికి సీఎం కేసీఆర్తో పాటు ఆయన మనవడు హిమాన్షు కూడా వచ్చాడు. ప్రణబ్ ముఖర్జీ విమానం ఎక్కిన తర్వాత వెనక్కు బయల్దేరిన గవర్నర్ నరసింహాన్ తన పక్కనే వస్తున్న హిమాన్షు భుజంపై చెయ్యేసి కాసేపు సరదాగా ముచ్చటించారు.
అయితే గవర్నర్ ఏమి అడిగారో తెలియదు గానీ, దానికి హిమాన్షు చెప్పిన సమాధాన్ని సీఎం కేసీఆర్ ఆసక్తిగా వినడం కనిపించింది. అంతేకాదు కేసీఆర్ వారిద్దరి సంభాషణను ఆసక్తిగా తిలకిస్తూ ముందుకు సాగారు. ఈ మధ్య కాలంలో కేసీఆర్తో పాటు హిమాన్షు పలు అధికారిక కార్యక్రమాల్లో తాత వెంట ఉంటున్న కనిపిస్తున్న సంగతి తెలిసిందే.
శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 18న ప్రణబ్ హైదరాబాద్కు వచ్చిన సంగతి తెలిసిందే. 14 రోజుల పర్యటనలో ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రపతి గౌరవార్థం మంగళవారం సాయంత్రం రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ విందు ఏర్పాటు చేయగా, బుధవారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ప్రణబ్ తేనీటి విందును ఇచ్చారు.