మోడీ హైదరాబాద్కు చేసిందేమీ లేదు: ఒకే ఒక్క ఛాన్స్ అన్న కేటీఆర్
హైదరాబాద్: 18 నెలల టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఇతర ప్రాంతాల వారిపై ఈగ కూడా వాలకుండా శాంతిభద్రతలను పరిరక్షించామని పంచాయితీ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం తెలంగాణ భవన్లో బీజేపీ నేతలు బంగారు ప్రకాశ్, సామ సుందర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి వర్గానికి మేలు చేసిందన్నారు. పేదల పక్షాన నిలవాలనే ఉద్దేశ్యంతోనే సీఎం కేసీఆర్ వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్లు ప్రవేశపెట్టారని తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనపై హైదరాబాద్ వాసులకు పూర్తి నమ్మకముందన్నారు.
దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పాలని ఆయన నిలదీశారు. ప్రధాని మోడీ హైదరాబాద్కు ఏం చేశారో చెప్పాలని బీజేపీ నేతలను డిమాండ్ చేశారు. మోడీ ఏనాడైనా తెలంగాణ ప్రజలకు ముఖం చూపించారా? అని ప్రశ్నించారు.

ప్రధాని మోడీ రెండేరెండు ఉన్నాయన్నారు. ఒకటి చీపురుకట్ట ఇచ్చి ఎవరి ఇల్లు వాళ్లు ఊడ్చుకోమనడం, రెండోది ఎవరి బ్యాంక్ ఖాతా వారు తెరుచుకుని ఎవరి డబ్బును వారు ఖాతాలో జమ చేసుకోమనడమేనని ఆయన ఎద్దేవా చేశారు. ఏ ముఖం పెట్టుకుని బీజేపీ నేతలు గ్రేటర్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు.
హైదరాబాద్ ప్రజలు ఈరోజు ప్రశాంతంగా ఉన్నారని అలాంటి వాతావరణాన్ని కలుషితం చేద్దామని బీజేపీ, టీడీపీ కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. మతం పేరుతో బీజేపీ, ప్రాంతం పేరుతో టీడీపీ రాజకీయాలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. బీజేపీ మత రాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు.
బీజేపీకి ఎందుకు హైదరాబాద్ ప్రజలు ఓటు వేయాలన్నారు. తెలంగాణ ప్రజల కష్టాలు దత్తాత్రేయ, కిషన్రెడ్డికి కనిపించడం లేదా? అని ఆయన నిలదీశారు. హైదరాబాద్కు ప్యాకేజీ విషయంలో బీజేపీ నేతలు ప్రధాని మోడీని ఎందుకు పట్టుపట్టరని మండిపడ్డారు. 65 ఏళ్లలో ప్రజలకు ఏమీ చేయని కాంగ్రెస్కు ఎందుకు ఓటెయ్యాలి? అని కేటీఆర్ ప్రశ్నించారు.
తమ టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతోన్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలితాలు ప్రతీ ఒక్కరికి అందుతాయన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మా పక్కవాళ్లకు వచ్చాయని తమకు రాలేదని ఆందోళన చెందొద్దన్నారు. వాళ్లకు వచ్చిందంటే మీకు కూడా వస్తుందనే అర్థం కదా అని వివరించారు. సిటీలో పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రావాలంటే కొంత సమయం పడుతుందన్నారు.
నాలుగేళ్లలో నగరంలోని పేదలందరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. దఫాలవారీగా ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఈ సంవత్సరం నగరంలో పదివేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టిస్తున్నామని వెల్లడించారు. కొంత సమయం వేచి చూస్తే పేదలందరికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వస్తాయన్నారు.
హైదరాబాద్కు ప్రభుత్వం ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని చెప్పిన కేటీఆర్ కేవలం టీఆర్ఎస్కు మాత్రమే గ్రేటర్ ప్రజలు అధికారం కట్టబెట్టలేదని అన్నారు. ఈసారి టీఆర్ఎస్కు అధికారం కట్టబెడితే గత 50 ఏళ్లలో పాలకులు చేయలేనివన్నీ చేసి చూపిస్తామని ఆయన చెప్పారు.
రానున్న ఐదేళ్లలో గ్రేటర్ హైదరాబాదును ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. ఎంఐఎం, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు హైదరాబాదుకు చేసిందేమీ లేదని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications