మూత్రం వస్తుందని బస్సు దిగి కాలికి బుద్ధి చెప్పిన ఖైదీ
వరంగల్: తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా సెంట్రల్ జైలు ఖైదీ ఉప్పల సూరీ పోలీసుల ఎస్కార్ట్ల కళ్లు కప్పి పారిపోయాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా జనగామ సమీపంలో చోటు చేసుకుంది. పారిపోతున్న సమయంలో సూరిపై పోలీసులు కాల్పులు జరిపారు.
హైదరాబాదులోని నాంపల్లి కోర్టులో హాజరుపరిచి తీసుకొస్తుండగా ఈ సంఘటన జరిగింది. జనగామ దగ్గర యశ్వంతపూర్ సమీపంలో టాయిలెట్ వస్తోందని బస్సును ఆపారు. ఎస్కార్ట్తో సహా దిగిన సూరి అక్కడి నుంచి పరుగులు తీశారు. సూరి తప్పించుకున్న వెంటనే ఒక రౌండ్ పోలీసులు కాల్పులు జరిపారు.
అయినా సూరి లెక్కచేయకుండా తప్పించుకుని పరారయ్యాడు. అయితే అదేసమయంలో వరంగల్ సెంట్రల్ జైలులో ఓ కార్యక్రమం ప్రారంభోత్సవానికి వచ్చిన హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి కాన్వాయ్ అదే దారిలో వెళ్లడంతో పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. సూరి తప్పించుకోవడంతో అతనికోసం రెండు బృందాలు ప్రస్తుతం గాలిస్తున్నాయి.