వరల్డ్ కప్ ఫీవర్: జైళ్లలో ఖైదీలకు కూడా అనుమతి
పెర్త్: తెలంగాణలోని చంచల్ గూడ, చర్లపల్లి జైళ్లలో ఖైదీలకు ఈరోజు పెర్త్లో జరుగుతున్న భారత్-వెస్టిండిస్ మ్యాచ్ చూసేందుకు అనుమతిచ్చారు. ఈరోజు జరుగుతున్న ఈ మ్యాచ్ను రెండు జైళ్లలోని ఖైదీలకు చూపించనున్నట్లు జైళ్ల డీజీ వీకే.సింగ్ తెలిపారు.
దీని కోసం చర్లపల్లిలో 100 టీవీలను, చంచల్ గూడలో 50 టీవీలను ప్రదర్శన కోసం ఏర్పాటు చేశారు. జైలు నిబంధనల ప్రకారం ఖైదీలు దూరదర్శన్లో ప్రసారమయ్యే మ్యాచ్లను మాత్రమే చూస్తారని వీకే.సింగ్ ప్రకటించారు.
ఐసీసీ వరల్డ్ కప్లో భారత్, మిగతా దేశాలతో ఆడుతున్న మ్యాచ్లను డీడీ1లో ప్రసారం చేస్తున్న విషయం తెలిసిందే. టీవీలో వచ్చే వినోద కార్యక్రమాలతో పాటు క్రికెట్ను చూసేందుకు ఖైదీలకు అనుమతివ్వాల్సిందిగా గౌహతి హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో సెంట్రల్ జైలు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని సెంట్రల్ జైళ్లలో ఎప్పటి నుంచో టీవీలున్నాయి. అన్ని తరగతుల ఖైదీలు టీవీలను వీక్షించేందుకు వీలుగా వాటి సంఖ్యను కూడా పెంచారు. కొన్ని ప్రత్యేక సెల్లకు ఒక్కో రూమ్కి ఒక్కో టీవీ ఉంటుంది. జైలులోని ఖైదీలకు రాత్రి 9 గంటల వరకే టీవీని చూసేందుకు అనుమతించారు.
జైళ్లలో కేవలం క్రికెట్ను చూసేందుకు మాత్రమే అనుమతించారు, ఆడేందుకు కాదని జైలు అధికారులు తెలిపారు. దీనికి బదులుగా షటిల్, వాలీబాల్, క్యారెమ్స్, చెస్ ఆడేందుకు అనుమతి ఉంది. చర్లపల్లి జైలు సూపరిడెంట్ కెవి రెడ్డి మాట్లాడుతూ ఐసీసీ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్లను చూసేందుకు ఎక్కువ మంది ఖైదీలకు అనుమతిచ్చామన్నారు.
శుక్రవారం జరగుతున్న మధ్యాహ్నాం ప్రారంభమైన భారత్-వెస్టిండిస్ మ్యాచ్కి 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే అనుమతించామని చెప్పారు. అయితే ఎక్కువ మంది ఖైదీలు పూర్తి మ్యాచ్ను వీక్షించలేరని తెలిపారు. అందుకు కారణం జైళ్లలో ఉన్న ఫ్యాక్టరీలలో సాయంత్రం 5 గంటల వరకు పని చేయాల్సి ఉంటుందన్నారు.