తెలంగాణ కాంగ్రెస్పై ప్రియాంకగాంధీ ఫోకస్: మునుగోడులో ప్రచారానికి వచ్చే ఛాన్స్!!
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పై ప్రియాంక గాంధీ ఫోకస్ పెట్టారు. పార్టీ నేతల మధ్య కొనసాగుతున్న అంతర్గత విబేధాల నేపధ్యంలో ఇక నుంచి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాలు ప్రియాంక గాంధీ అనుమతి పొందిన తర్వాతనే అమలు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇదే సమయంలో మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని కలుపుకొని పనిచేయాలని ప్రియాంక గాంధీ పార్టీ నేతలకు సూచించారు.
తెలంగాణా కాంగ్రెస్ ను గాడిలో పెట్టటం కోసం రంగంలోకి ప్రియాంకా గాంధీ
రోజుకు ఒక రకంగా ఒకరికొకరు సయోధ్య లేకుండా పని చేస్తున్న కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టడం కోసం తెలంగాణ పాలిటిక్స్ లో ప్రియాంక గాంధీ ఎంట్రీపై పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికను 'చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని' తెలంగాణలో కాంగ్రెస్ స్థానాన్ని బీజేపీ ఆక్రమించకుండా ఆపాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సోమవారం జరిగిన భేటీలో సీనియర్ నేతలను ఆదేశించారని తెలుస్తుంది.
మునుగోడు ఉప ఎన్నికలో గెలవటం కోసం అన్ని ప్రయత్నాలు చెయ్యండి
మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్ భవిష్యత్తుకు కూడా కీలకం కనుక గెలవడానికి అన్ని ప్రయత్నాలను చేయాలని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వెల్లడించారు. విభేదాలను పక్కనబెట్టి ఉపఎన్నికల్లో విజయం సాధించేందుకు సమష్టిగా కృషి చేయాలని పార్టీ నేతలకు సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ను బలోపేతం చేసేందుకు, అధికారంలోకి తీసుకురావడానికి మీరందరూ ఎంత సమయం ఇస్తారో, అంతే సమయం తాను వారికి ఇస్తానని టీపీసీసీ అగ్రనేతలకు ప్రియాంక గాంధీ వెల్లడించారు.
అభ్యర్థిని నెలాఖరులోగా ఖరారు చెయ్యాలన్న ప్రియాంకా గాంధీ
మునుగోడు లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే, పార్టీతో పాటు అందరికీ మంచి జరుగుతుందని అలా కాకుండా ఓటమి పాలైతే, పార్టీతో పాటు మీరంతా నష్టపోతారని ప్రియాంక గాంధీ నేతలకు చెప్పినట్టు సమాచారం. ఉమ్మడి నల్గొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలతో చర్చించి ఉప ఎన్నికకు అభ్యర్థిని ఖరారు చేయాలని, ఈ నెలాఖరులోగా పేరును ప్రకటించాలని ఆమె పార్టీ నేతలను కోరారని తెలుస్తుంది. అంతేకాదు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో మాట్లాడే బాధ్యతను దామోదర రాజనర్సింహకు, మధుయాష్కిగౌడ్ లకు అప్పగించారు ప్రియాంక గాంధీ.
మునుగోడులో ప్రియాంకా గాంధీ ప్రచారానికి వచ్చే అవకాశం
రాష్ట్ర నాయకుల మధ్య విభేదాలు చాలా చిన్నవని పేర్కొన్న ప్రియాంక గాంధీ ఎటువంటి సమస్య ఉన్న తాను అందుబాటులో ఉండి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తాజాగా తెలంగాణ రాజకీయాలపై, మునుగోడు పై దృష్టి సారిస్తున్న ప్రియాంక గాంధీ మునుగోడు ప్రచారానికి వచ్చే అవకాశం ఉందని పార్టీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇక ఇదే సమయంలో ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారని, తెలంగాణలోనే కాకుండా దాదాపు అన్ని రాష్ట్రాలకు చెందిన నేతలను కలుస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు.