సీఎం కేసీఆర్,టీఆర్ఎస్ను దెబ్బ కొట్టేలా హుజూరాబాద్ బరిలో 1000 మంది ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు -నాడు కవితపై
గత సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోని నిజామాబాద్ పార్లమెంట్ స్థానం యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. పసుపు బోర్డు ఏర్పాటులో విఫలమైన సిట్టింగ్ ఎంపీ, ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవితపై ఆగ్రహించిన రైతులు వందల సంఖ్యలో పోటీకి దిగి, ఓట్లను భారీగా చీల్చడంతో టీఆర్ఎస్ ఓడిపోయింది. బోర్డు తెస్తానని బాండ్ పేపర్లు రాసిచ్చి గెలిసిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సైతం ఇచ్చినమాటను నిలబెట్టుకోలేకపోవడం వేరే విషయం. ఇప్పుడు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ స్థానంలోనూ నాటి నిజామాబాద్ సీన్ రిపీట్ అయ్యేలా..

పోరు బాటలో ఫీల్డ్ అసిస్టెంట్లు..
కరోనా విలయంలోనూ దేశంలో ఆకలి చావులు లేనందుకు కారణమైన 'మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథక(ఎంజీఎన్ఆర్ఈజీఎస్)' కింద చేపట్టే కార్యక్రమాల్లో ఫీల్డ్ అసిస్టెంట్ల పాత్ర కీలకమైనది. తెలంగాణలో మాత్రం గతేడాది ప్రభుత్వం ఈ వ్యవస్థను రద్దు చేసింది. ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ల బాధ్యతలను గ్రామ పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. 7,500 ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో వేలాది మంది ఫీల్డ్ అసిస్టెంట్లు నెలల తరబడి నిరసనోద్యమాలు సాగిస్తున్నారు.

కేసీఆర్కు కోపం తెప్పించి..
అరకొర జీతాలతో 14 ఏళ్లుగా నెట్టుకొస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు 4779 సర్క్యులర్ శాపంగా మారింది. గ్రామాల్లో కల్పించిన పని దినాలను బట్టి ఎఫ్ఏల పని తీరును మూడు కేటగిరీలుగా గ్రామీణాభివృద్ధి శాఖ విభజించింది. తమ ఉద్యోగ భద్రతకు ముప్పుగా పరిణమించిన 4779 సర్క్యులర్ రద్దు చేయాలని, వేతనాలు పెంచాలనే డిమాండ్తో ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. మార్చి 12న సమ్మెకు దిగారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో అదే నెల 20న ఆందోళన విరమించారు. అయితే, అప్పటికే నోటీసులు జారీ చేసిన అధికారులు వారిని విధుల్లో చేర్చుకోలేదు. తమను విధుల్లోకి చేర్చుకోవాలని ప్రభుత్వ పెద్దలను కలిసినా సానుకూల స్పందన రాలేదు. సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా మసలిన ఫీల్డ్ అసిస్టెంట్ల విషయంలో ఆగ్రహించిన సీఎం కేసీఆర్.. తొలగించిన ఎఫ్ఏల విధులను పంచాయతీ కార్యదర్శులకు కట్టబెట్టారు. ఐదు నెలలుగా ఆందోళనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎంతకీ పట్టించుకోకపోవడంతో..

హుజూరాబాద్ బరిలో వెయ్యి మంది
నెలలుగా ఉద్యమిస్తోన్న ఉపాధి హామీ ఫీల్ట్ అసిస్టెంట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో బరిలోకి దిగడం ద్వారా టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ లకు గుణపాఠం చెబుతామని అంటున్నారు. తొలగింపునకు గురైన మొత్తం 7600 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి చేర్చుకోకుంటే, రాబోయే ఉప ఎన్నికలో కనీసం వెయ్యి మంది పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఉపాధి హామీ ఫీల్ట్ అసిస్టెంట్లకు మద్దతుగా బీసీ ఉద్యమనేత ఆర్. కృష్ణయ్య బుధవారం హైదరాబాద్ లో దీక్షకు దిగారు. తమను విధుల్లోకి తీసుకుంటే హుజూరాబాద్ లో పోటీ చేయాలనే నిర్ణయం మార్చుకుంటామని ప్రభుత్వానికి ఫీల్ట్ అసిస్టెంటు షరతు విధించారు. ఒకవేళ ప్రభుత్వం దిగిరాకుంటే నిజామాబాద్ లో కేసీఆర్ కూతురు కవితకు ఎదురైన అనుభవమే హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థికీ తప్పదని వారు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications