కాకతీయ వారసుడిగా గర్విస్తున్నా.. ఓరుగల్లుకు రావటం మాటల్లో చెప్పలేని ఆనందం: కమల్చంద్ర భాంజ్దేవ్
వరంగల్: కాకతీయుల గత చారిత్రక వైభవాన్ని భావితరాలకు చాటేలా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కాకతీయ వైభవ సప్తాహం పేరుతో నిర్వహిస్తున్న కాకతీయ ఉత్సవాలకు కాకతీయుల 22వ వారసుడు కమల్ చంద్ర భాంజ్ దేవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాకతీయులు పరిపాలించిన ఓరుగల్లు గడ్డమీద కాలు పెట్టిన ఆయన, తమ పూర్వీకులు పరిపాలించిన ప్రాంతానికి వచ్చినందుకు పులకించిపోయారు.
ఇక కాకతీయుల వారసుడికి రాష్ట్ర మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు గ్రాండ్ వెల్ కమ్ చెప్పగా, ఆయన కాకతీయ రాజులు ఆరాధించిన భద్రకాళీ అమ్మవారిని, వేయిస్తంభాల దేవాలయానికి వెళ్లి పూజాధికాలు నిర్వహించారు. వేద మంత్రాలతో ఆలయ పండితులు కాకతీయ వారసుడికి ఆశీర్వచనం పలికారు.
పూర్వీకుల గడ్డపై ఉన్నందుకు సంతోషంగా ఉందన్న కమల్ చంద్ర భాంజ్ దేవ్
ఇక కాకతీయ రాజులు పరిపాలించిన కోట ప్రాంతాలలో పర్యటించిన ఆయన తమ పూర్వీకుల గొప్పతనాన్ని గుర్తుచేసుకొని సంతోషం వ్యక్తం చేశారు. కాకతీయ వంశ వారసుడిగా ఓరుగల్లును సందర్శించే అవకాశం రావడం తిరిగి తన తల్లి వద్దకు చేరినట్టుగా ఉందని ఆయన పేర్కొన్నారు. మాటల్లో చెప్పలేని ఆనందంతో మనసంతా నిండి పోయిందని వెల్లడించారు. నా మూలాలను వెతుక్కుంటూ ఓరుగల్లుకు వచ్చానని పేర్కొన్న ఆయన రాచరిక చరిత్రలో ప్రజా పాలన సాగించిన ఘనత కాకతీయులకు మాత్రమే దక్కుతుందని వ్యాఖ్యానించారు.
కాకతీయ రాజుగా ఉన్నందుకు తాను గర్వపడుతున్నానన్న కాకతీయ వారసుడు
తమ పూర్వీకులు ఎన్నో బహుళార్థసాధక ప్రాజెక్టులను నిర్మించారని, చారిత్రక కట్టడాలను చేశారని, గొలుసుకట్టు చెరువులను తవ్వారని, అందుకే ప్రజలు తమ వంశీయులను, రాజులుగా కాకుండా ప్రజలు దేవుళ్ళుగా చూస్తారని ఆయన పేర్కొన్నారు. కాకతీయ రాజుగా ఉన్నందుకు తాను గర్వపడుతున్నానని తెలిపారు కమల చంద్ర భాంజ్ దేవ్. వరంగల్ ప్రజలు ఎప్పుడూ తన వాళ్ళే అని చెప్పిన ఆయన వాళ్ల కోసం ఏదైనా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మా వంశస్థులు పరిపాలించిన గడ్డకు రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
ప్రజలకు సేవ చెయ్యటమే లక్ష్యం అన్న కమల్ చంద్ర భాంజ్ దేవ్
కమల్ చంద్ర భాంజ్ దేవ్ ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యమని వెల్లడించారు. బస్తర్లో తన సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, తెలంగాణలోని టార్చ్ ఎన్జీవో ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేయనున్నామని తెలిపారు కాకతీయుల సంస్కృతిని పరిరక్షించే భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్న కమల్ చంద్ర భాంజ్ దేవ్ కాకతీయుల గత వైభవానికి సంబంధించిన సమాచారాన్ని గ్రంథస్థం చేస్తామంటూ వెల్లడించారు. ప్రస్తుతం తాను జగదల్పూర్ కోటలో ఉంటున్నారని బస్తర్ వేదికగా రాజ్య పాలన చేసింది కూడా కాకతీయ రాజులేనని ఆయన పేర్కొన్నారు.