బ్లాక్ బాబులకు షాక్: ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్ల బేజార్
వరంగల్: ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ. 500, 1000 కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్టు మంగళవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంతో జిల్లా యావత్తూ ఉలిక్కిపడింది. బుధవారం నుంచి ఈ రెండు రకాల నోట్లను బ్యాంకులు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు అంగీకరించబోవని స్పష్టం చేయడంతో జనం బెంబేలెత్తిపోయారు.
నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు తమ వద్ద వున్న నోట్లను ఏటీఎంలలో డిపాజిట్ చేసేందుకు పరుగులు తీశారు. అయితే రాత్రి 11.30 తర్వాత ఏటీఎంలు కూడా పనిచేయలేదు. దీంతో అనేకమంది నిరాశతో వెనుదిరిగారు. ప్రజలు తమ వద్ద వున్న రూ. 500, 1000 కరెన్సీ నోట్లను డిసెంబర్ 31లోగా బ్యాంకులు, పోస్టల్ కార్యాలయాల్లో మార్చుకోవచ్చని ఆర్బిఐ ప్రకటించింది.
తాజా నిర్ణయంతో నల్లధనం కలిగివున్న వారికి షాక్ తగిలినట్లయింది. అలాగే నకిలీనోట్ల చలామణికి అడ్డుకట్ట పడనుంది. కేంద్ర నిర్ణయం విప్లవాత్మకమైనదని, పన్నుల రాబడి పెరిగేందుకు ఎంతో ఉపయోగపడుతుందని భిన్న వర్గాల ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. భారత కరెన్సీలో సరికొత్త మార్పు చోటుచేసుకున్నది. నల్లధనం వెలికితీతతోపాటు నకిలీ కరెన్సీని అరికట్టేందుకు కేంద్రం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది.
దీనిలో భాగంగా రూ. 500,1000 నోట్లను రద్దు చేసింది. వీటి స్థానంలో సరికొత్త 500, 2000 నోట్లు చెలామణిలోకి రానున్నాయి.. పాత నోట్లను డిసెంబర్ 31లోపు బ్యాంకులు, పోస్టల్ కార్యాలయాల్లో మార్చుకోవచ్చు. మూడు రోజులు అంటే 11 నవంబర్ వరకు రైల్వే స్టేషన్లు, ఆస్పత్రులు ఆర్టీసీ కౌంటర్లు, ఎయిర్లైన్స్, పెట్రోల్ బంక్లు, ప్రభుత్వ పాల కేంద్రాలు, వినియోగ దారుల సహకార కేంద్రాల్లో పాత కరెన్సీ చెల్లుబాటు అవుతాయి.
నేడు బ్యాంకులు పనిచేయవు
నేడు అన్ని బ్యాంకుల్లో వినియోగదారుల సేవలను కూడా రద్దు చేశారు. దీంతో పాటు నేడు, రేపు అన్ని బ్యాంకులకు సంబంధించిన ఏటీఎం సెంటర్లు కూడా పనిచేయవు. ప్రసార మాధ్యమాల ద్వారా సమాచారం తెలుసుకున్న ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
ఏటీఎం సెంటర్ల ద్వారా తమ డబ్బులను డ్రా చేసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఏటీఎం సెంటర్ల వద్ద జనం బా రులు తీరి కనిపించారు. ఏటీఎం సెంటర్ల నుంచి డ్రా చేసుకునేందుకు ప్రయత్నించిన వారికి సైతం ఇబ్బందికర పరిస్థితిని ఎదురుకోవాల్సి వచ్చింది. ఏటీఎంల నుంచి కూడా రూ.500,1000ల నోట్లు రావడంతో ఏమి చేయాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొన్నది.
రోడ్డెక్కిన జనం..
ఐదొందలు, వెయ్యి రూపాయల నోట్లు ఇక చెల్లవని తెలుసుకున్న ప్రజలు ఒక్కసారిగా రోడ్డు మీద పడ్డారు. తమ వద్ద ఉన్న నోట్లను డిపాజిట్ మిషన్ల ద్వారా బ్యాం కు ఖాతాల్లో జమ చేసే ప్రయత్నం చేశారు. వరంగల్ పట్టణంలోని ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, ఆంధ్రాబ్యాంకులకు సంబంధించిన డిపాజిట్ మిషనలలో దాచుకున్నా రు. మంగళవారం రాత్రి 11.30గంటలకు డిపాజిట్ మిషనలు సైతం పనిచేయడం మానివేశాయి. దీంతో ఇంట్లో నుంచి హడావుడిగా డబ్బులతో వచ్చిన వారు నిరాశతో తిరిగి డబ్బులను తీసుకెళ్ళడం కనిపించింది.
గుట్టు తేలనుంది..
ప్రభుత్వ నిర్ణయంతో కరెన్సీ కట్టల గుట్టు తేలనుంది. ఇంతకాలం ఎవరి కంటా పడకుండా దాచుకున్న డబ్బు ఒక్కసారిగా వెలుగు చూడనుంది. బడా కాంట్రాక్టర్లు, ఫైనాన్స్ వ్యాపారులు, వైద్యులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వద్ద మూలుగుతున్న డబ్బు అనివార్యంగా బయటకు రావలసి ఉంటుంది. ఒక్క వరంగల్ నగరంలోనే కోట్లాది రూపాయల నల్లధనం ఉన్నట్టు ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లెక్కకు రాని డబ్బులు ప్రెవే ట్ ఫైనాన్స్ల పేరుతో, రియల్ ఎస్టేట్ దందాల్లో కొనసాగుతున్నా యి. వరంగల్ జిల్లాలో ఉన్న ప్రముఖ వ్యక్తులకు సంబంధించిన లాకర్లలలో సైతం కోట్టాది రూపాయల కరెన్సీ మూలుగుతున్నట్లు ఆదాయ శాఖ అనుమానిస్తోంది.
దాచుకుంటే మురిగిపోయినట్టే..
ప్రముఖ వ్యాపారులు, ఇతర స్థితి మంతులు కనీసం రూ.20లక్షల నుంచి రూ.5కోట్ల వరకు వరంగల్ నగరంలో ఉన్న వ్యాపారులు కరెన్సీ రూపంలో తమ రహస్య గదుల్లో దాచుకుని ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇపుడు వారంతా తమ నల్లధనాన్ని అధికారిక కరెన్సీగా మార్చాలంటే తప్పనిసరిగా వాటికి లెక్కలు చూపించాల్సి ఉం టుంది.
సంవత్సరం ఆదాయం రూ.2.లక్షల50 వేల నుంచి రూ.5లక్షల వరకు సంపాదన ఉన్న వారు ప్రభుత్వానికి 10శాతం పన్నురూపంలో చెల్లించాల్సి ఉంటుంది. రూ.5లక్షల నుంచి రూ.20లక్షల వరకు ఉంటే 20శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత రూ.10లక్షల నుంచి ఆ తర్వాత సంపాదించే డబ్బులకు 30శాతం చొప్పున పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
ఈ పన్నులు ఎగ్గొట్టడానికి తమ ఆదాయాలను ప్రభుత్వాలకు తప్పుడు లెక్కలు చూపిస్తారు.. తమ వద్ద ఉన్న ప్రభుత్వానికి చూపించకుండా దాచుకున్న డబ్బులనే నల్ల ధనం (బ్లాక్ మనీ) అంటారు. ఇలాంటి వాళ్లంతా తమ లావాదేవీలను మొత్తాన్ని తక్కువ చేసి చూపిస్తారు. ఉదాహరణకు ఖరీదైన భూములను కొనుగోలు చేస్తారు. ప్రభుత్వం నిర్దేశించిన రిజిషే్ట్రషన విలువకు కొన్ని చోట్ల పది రెట్లు ఎక్కువ విలువ ఉంటుంది. అటువంటప్పుడు సదరు ఆస్తికి లక్షల్లో రిజిస్ట్రేషన్ల మొత్తాన్ని చెల్లించి, కోట్లల్లో బ్లాక్ మనీ చెల్లిస్తారు. ఇదంతా తమ ఇళ్ళల్లో బస్తాల్లో దాచుకున్న కరెన్సీనీ అందిస్తారు.
ఇపుడు అలాంటివి చెల్లకుండా పోయే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో, లాకర్లలో దాచుకున్న డబ్బులు వైట్ మనీగా మార్చాలంటే బ్యాంకు లావాదేవీలు జరగాల్సి ఉంటుంది. బ్యాంకు లావాదేవీల ఆధారంగా ఆదాయశాఖ అధికారులు ఇంటికి చేరుకుని పన్నులు వసూలు చేస్తారు. పన్నులు చెల్లించడంతో పాటు ఆదాయ మార్గాలను వివరించాల్సి ఉంటుంది. ఇదంతా ఎందుకొచ్చిన గొడవ అనుకుంటే డిసెంబర్ తర్వాత దాచుకున్న కరెన్సీ కట్టలు చిత్తు కాగితాలతో సమానంగా మారిపోతాయి. ఇపుడు సంపన్నుల ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న చందంగా మారి పోయింది.