గతంలో సీఎంలు పుష్కరాల అనంతరం పదవులు కోల్పోయారు!
రాజమండ్రి/హైదరాబాద్: గోదావరి పుష్కరాలలో పుణ్య స్నానం ఆచరించిన ముఖ్యమంత్రులకు పదవీ గండం ఉంటుందా? అనే చర్చ సాగుతోంది. 1955 నుండి గతంలో జరిగిన పుష్కరాల వరకు పలువురు ముఖ్యమంత్రులు పదవిని కోల్పోవలసి వచ్చిందని చెబుతున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న పుష్కరాలను మినహాయించి, గతంలో జరిగిన పుష్కరాల సమయంలోని ముఖ్యమంత్రులు పదవులు పోగొట్టుకోవాల్సి వచ్చిందని అంటున్నారు.
1955లో బెజవాడ గోపాల రెడ్డి నుండి ప్రారంభమై 2003లో నారా చంద్రబాబు నాయుడు వరకు.. పుష్కర స్నానం చేసిన ముఖ్యమంత్రులు పదవికి దూరమయ్యారని అంటున్నారు.
అయితే, గోదావరి పుష్కరాల వల్ల ముఖ్యమంత్రికి లేదా ఇతరులకు ఎవరికి కూడా నష్టం జరగదని, మంచి జరుగుతుందని చెబుతున్నారు. పుష్కరాల అనంతరం పదవులు కోల్పోతారనేది వట్టి మాటలే అంటున్నారు.

పుష్కరాల అనంతరం ఎవరైనా ముఖ్యమంత్రి లేదా ఇతరులు పదవులు కోల్పోతే.. అది పుష్కరాల ఎఫెక్ట్ అనుకోవడం అపోహ అని చెబుతున్నారు. అది వారి గ్రహబలాన్ని బట్టి ఉంటుందని జ్యోతిష్యులు అభిప్రాయపడుతున్నారు.
ఓటుకు నోటు వ్యవహారంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చిక్కులు ఎదుర్కొంటున్న విషయం తెలుసిందే.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర ఉందని, దీంతో ఆయన పదవి పోవడం ఖాయమని నిన్నటి వరకు టిఆర్ఎస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు చెప్పాయి. అదే సమయంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో తమ వద్ద బలమైన ఆధారాలున్నాయని, వాటి ద్వారా కెసిఆర్ ప్రభుత్వం పడిపోవడం ఖాయమని ఏపీ మంత్రులు, టిడిపి నేతలు చెప్పడం గమనార్హం.












Click it and Unblock the Notifications