నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ముందుకు రాహుల్: హైదరాబాద్లో కాంగ్రెస్ భారీ నిరసన
హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం విచారిస్తున్న నేపథ్యంలో టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన భారీ నిరసన ర్యాలీ బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం వద్దకు చేరుకుంది. ఢిల్లీలోని ఈడీ కార్యాలయం నుంచి రాహుల్ గాంధీ బయటకు వచ్చే వరకూ నిరసన ప్రదర్శన చేపట్టాలని దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈ ర్యాలీ చేపట్టారు.
సోమవారం ఉదయం నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ప్రారంభమైన కాంగ్రెస్ నేతల ర్యాలీ బషీర్బాగ్ ఈడీ కార్యాలయానికి చేరుకుంది. అక్కడే ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ నేతలు రోడ్డుపైనే బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారీ ఎత్తున కాంగ్రెస్ నేతలు రోడ్డపై బైఠాయించడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది.
సీపీ కార్యాలయం నుంచి అసెంబ్లీ వైపు ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ నేతలు, భారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. *గాంధీ కుటుంబం పై అక్రమ కేసుల విషయంలో మోడీ ప్రభుత్వ దమననీతిని నిరసిస్తూ సాగర తీరాన జనవాహిని... ప్రతిధ్వని... "సత్యమేవ జయతే..."' అని రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.

కాగా, నేషనల్ హెరాల్డ్ కేసులో 3 గంటల పాటు విచారణ తర్వాత ఈడీ కార్యాలయం నుంచి బయటికివచ్చారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. భోజన విరామం ఇచ్చినట్లు ఈడీ వర్గాలు వెల్లడించారు. తుగ్లక్ లేన్లోని నివాసానికి చేరుకున్నారు రాహుల్ గాంధీ. మనీలాండరింగ్కు పాల్పడినట్లు ఆరోపణలతో ఇటీవల సమన్లు జారీ చేయగా.. సోమవారం ఈడీ ఎదుట హాజరయ్యారు రాహుల్. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 వరకు దాదాపు 3 గంటల పాటు ఈడీ విచారించింది.
ర్యాలీ దృష్ట్యా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఖైరతాబాద్ కూడలి, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, చింతల్ బస్తీ, లక్డీకపూల్, బషీర్బాగ్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ కూడలి, అంబేడ్కర్ విగ్రహం, ఎన్టీఆర్ మార్గ్, లిబర్టీ జంక్షన్, సచివాలయ మార్గాల్లో వాహనాలను దారి మళ్లించారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications