గాంధీకి మాదిరే రోహిత్కు అన్యాయం జరిగింది: రాహుల్, ఉద్రిక్తత
హైదరాబాద్: మహాత్మా గాంధీకి మాదిరిగానే వేముల రోహిత్కు అన్యాయం జరిగిందని కాంగ్రెసు నాయకుడు రాహుల్ గాంధీ చెప్పారు. రోహిత్ ఆత్మహత్యపై హెచ్సియు విద్యార్థులు చేస్తున్న దీక్షకు మద్దతుగా ఆయన శనివారంనాడు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఆయన చేత ప్రొఫెసర్ కంచె ఐలయ్య నిమ్మరసం ఇచ్చి సాయంత్రం దీక్ష విరమింపజేశారు.
సత్యాన్ని నినదించే హక్కు, స్వేచ్ఛ రోహిత్కు ఇవ్వలేదని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యానికి భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదని ఆయన అన్నారు. కుల వివక్షకు వ్యతిరేకంగా చట్టం తేవాలని ఆయన అభిప్రాయపడ్డారు. రోహిత్కు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదనే తాను వచ్చినట్లు తెలిపారు. బిజెపి తన భావజాలాన్ని ప్రజలందరిపై రుద్దాలని ప్రయత్నిస్తోందని రాహుల్ విమర్శించారు.
విద్యార్థులు బిజెపి భావజాలాన్ని అంగీకరిస్తే తమకు కూడా అంగీకారమేనని ఆయన అన్నారు. విద్యార్థులకు డిగ్నిటీ, రెస్పెక్ట్ ఇవ్వాలని ఆయన కోరారు. మిగిలిన అందరికన్నా తనకన్నా ప్రపంచమంటే ఏమిటో వాళ్లకు ఎక్కువగా తెలుసునని అన్నారు.
ఇక్కడి సమస్య కేవలం ఒక్క విద్యార్థిది మాత్రమే కాదని, మొత్తం దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో వివక్ష తీవ్రంగా ఉందని ఆయన అన్నారు. మహిళలు, మత, కులం.. ఇలా అన్ని రకాల వివక్షలు ఉన్నాయని ఆయన చెప్పారు.
ప్రధాని మోడీ చెబుతున్న మేకిన్ ఇండియా, కనెక్ట్ ఇండియా లాంటి ఐడియాలు కింది వరకు చేరడం లేదని, దిగువస్థాయిలో వివక్ష చాలా ఎక్కువగా ఉంటోందని ఆయన చెప్పారు. ఓ యువకుడిని జాతి వ్యతిరేక శక్తిగా చెబుతున్నారని, ఏ మతం నుంచి వచ్చినా, ఏ కులం నుంచి వచ్చినా భారతీయులమంతా దేశాన్ని బలోపేతం చేయాలనే దేశాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నామని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఎవరికీ తలవంచని ఆ కుర్రాడి ముదు తాను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.
ఎబివిపి ధర్నా, ఉద్రిక్తత
రాహుల్ దీక్షకు వ్యతిరేకంగా ఎబివిపి కార్యకర్తలు ధర్నా చేశారు. వారిని పోలీసులు లోనికి రానివ్వలేదు. ఎబివిపి కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. దాంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎబివిపి కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
కాంగ్రెసు నేతల అరెస్టు
రాహుల్ గాంధీకి మద్దతుగా హెచ్సియులోకి రావడానికి, విశ్వవిద్యాలయం గేటు వద్ద దీక్ష చేపట్టడానికి ప్రయత్నించిన కాంగ్రెసు నేతలను పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమను పోలీసులు అరెస్టు చేయడం దారుణమని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలను బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.