రిలయన్స్ స్మార్ట్ మాల్లో తూనికలు-కొలతలు, రెవెన్యూ, ఫుడ్, డ్రగ్ శాఖ అధికారుల ఆకస్మిక దాడులు
హైదరాబాద్: నగరంలోని చాంద్రాయణగుట్ట రిలయన్స్ స్మార్ట్ మాల్లో అవకతవకలు జరుగుతున్నాయనే సమచారంతో బుధవారం తూనికలు-కొలతల శాఖ, రెవెన్యూ శాఖ, డ్రగ్ శాఖ అధికారులు ఒకేసారి ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో మూడు కేసులు నమోదు చేశారు. మరికొన్ని షాపుల్లోనూ తనిఖీలు చేపట్టారు.
గత మూడు రోజులుగా పాతబస్తీలో కిరాణా షాపులు, హోల్సేల్, మెడికల్ షాపులు, కూరగాయల దుకాణాలపై దాడులు జరిపి 8 కేసులు నమోదు చేశారు. కరోనా సంక్షోభ సమయంలో ఎవరు కూడా ఎక్కువ ధరలకు విక్రయించకూడదని, ఎక్కువ ధరలకు విధించినవారిపై కేసులు నమోదు చేయడంతోపాటు జరిమానాలు విధిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

బుధవారం జిల్లా లీగల్ మెట్రోలాజికల్ ఆఫీసర్ సరోజ, రాఘవేంద్ర, సివిల్ సప్లై అసిస్టెంట్ ఆఫీసర్ తనూజ, యకుత్పూర, మొహమ్మద్ అలీ, చార్మినార్, ఫుడ్ ఇన్స్పెక్టర్ దైవనిధి తదితరులు చాంద్రాయణగుట్టలోని రిలయన్స్ స్మార్ట్ మాల్లోకి వెళ్లి కొన్ని వస్తువులను పరిశీలించారు. కొన్ని ఉత్పత్తులపై కాలపరిమితి ఎప్పుడు ముగుస్తుందనేది ప్రింట్ చేయలేదు, 25 కిలోల బియ్యం బస్తాను కొలువగా అరకిలో తక్కువ చూపించింది, లైసెన్స్ రెన్యూవల్ కాలేదని తెలుసుకుని.. రిలయన్స్ స్మార్ట్పై మూడు కేసులు నమోదు చేశారు.

రిలయన్స్ వారితో ప్రతి రోజూ కస్టమర్లు రేట్లకు సంబంధించి గొడవలు పడటం చూశామని స్థానికులు తెలిపారు. ఈ సందర్భంగా తనూజా మీడియాతో మాట్లాడుతూ.. ఎవరూ కూడా ఎక్కువ ధరలకు విక్రయాలు చేయరాదని, అలా చేస్తే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామన్నారు. హోల్సేల్, కిరణా షాపులు, కూరగాయల దుకాణాదారులు, మెడికల్ షాపులు.. ఇలా అందరికీ సూచనలు చేస్తున్నామని, అతిక్రమిస్తే వారికి జరిమానాలు విధిస్తామని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications