రసాయనాలతో కృత్రిమపాలు: వరంగల్లోని పాలడెయిరీపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులలో షాకింగ్ విషయాలు!!
తెలంగాణ రాష్ట్రంలో కల్తీ పాల దందా మూడు బాటిల్ లు, ఆరు క్యాన్ లుగా సాగుతోంది. ప్రమాదకర రసాయనాలతో పాలను తయారు చేస్తూ వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు డైరీ నిర్వాహకులు. ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహిస్తే తప్ప అసలు డైరీ ఫామ్ లలో ఏం జరుగుతుందో బయటకు వస్తున్న దాఖలాలు లేవు.
ఎన్ఎస్ఆర్ పాల డెయిరీపై ఫుడ్ కంట్రోల్ బోర్డు ప్రత్యేక బృందాల దాడులు
ఇక తాజాగా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఎన్ఎస్ఆర్ పాల డెయిరీపై ఫుడ్ కంట్రోల్ బోర్డు ప్రత్యేక బృందాలు మూకుమ్మడి దాడులు నిర్వహించాయి. . హనుమకొండ జిల్లా గుడెప్పాడ్లోని ఎన్ఎస్ఆర్ డైరీలో రసాయనాలతో కృత్రిమ పాలను తయారు చేసి విక్రయిస్తున్నారనే సమాచారంతో ఫుడ్ కంట్రోల్ బోర్డు టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో హైదరాబాద్లోని స్పెషల్ టాస్క్ఫోర్స్ సీనియర్ సైంటిఫిక్ అధికారి లక్ష్మీనారాయణరెడ్డి, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ అమృతతో పాటు వరంగల్, హనుమకొండ జిల్లాల ఫుడ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
రసాయనాలతో కృత్రిమ పాలు .. ఎన్ఎస్ఆర్ పాల డెయిరీ ఫుడ్ లైసెన్స్ రద్దు
ఈ దాడుల్లో ప్రజారోగ్యానికి విఘాతం కలుగుతోందని గుర్తించిన అధికారులు పెద్దఎత్తున గడువు ముగిసిన పాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఎలాంటి లేబుల్స్ లేని పాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని హైదరాబాద్లోని ల్యాబ్కు తరలించారు. ఎన్ ఎస్ ఆర్ డైరీలో రసాయనాలతో కృత్రిమ పాలను తయారు చేస్తున్న డెయిరీ నిర్వాహకులు నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని తేలింది. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని ఎన్ఎస్ఆర్ డైరీ ఫుడ్ లైసెన్స్ను అధికారులు తాత్కాలిక రద్దు చేశారు. అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు.
డెయిరీలో అక్రమాలు జరుగుతున్నట్టు నిర్ధారణ
నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని, రసాయనాలతో పాలు, పెరుగు తయారు చేయడం వల్ల ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని గత కొన్ని నెలలుగా ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో హైదరాబాద్ నుంచి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందం రంగంలోకి దిగింది. వరంగల్, హనుమకొండ జిల్లాల ఫుడ్ సేఫ్టీ అధికారుల సహకారంతో గుడెప్పాడ్ లోని ఎన్ఎస్ఆర్ డైరీపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో డైరీలో అక్రమాలు జరిగినట్లు తేలింది.
ల్యాబ్ నివేదికలు వస్తే తదుపరి చర్యలు
ఆహార భద్రతకు సంబంధించి నిబంధనలను సర్దుబాటు చేసేందుకు వారం రోజులు గడువు ఇచ్చినట్లు తెలుస్తోంది. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తే లైసెన్స్ రద్దు క్యాన్సిల్ చేస్తామని అధికారులు తెలిపారు. హైదరాబాద్ ల్యాబ్కు పంపిన నమూనాల నివేదిక వచ్చిన తర్వాత అధికారులు ఆ నివేదికను అనుసరించి డెయిరీ యాజమాన్యంపై చర్యలు చేపట్టనున్నారు. డెయిరీ ఫాం ను సీజ్ చేసిన అధికారులు ఈ డెయిరీ నిర్వహణపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.