రూ.10,700 కోట్లతో కొత్త రైల్వే ప్రాజెక్టులు: తెలుగు రాష్ట్రాలకు షాక్
న్యూఢిల్లీ: రూ.10,700 కోట్ల కొత్త రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ బుధవారం నాడు పచ్చజెండా ఊపింది. మరో పది రోజుల్లో 2016-17 రైల్వే బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆరు రైల్వే లైన్ల ప్రతిపాదనలకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ బుధవారం అనుమతులు మంజూరు చేసింది.
పెరిగిన ప్రయాణికుల, రవాణా అవసరాలను తీర్చేందుకు వీటిని అంగీకరిస్తున్నట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు సమావేశం అనంతరం విలేకరులతో చెప్పారు. ఈ ప్రాజెక్టుల కోసం రూ.10,700 కోట్లు వెచ్చించనున్నట్టు ఆయన తెలిపారు. అయితే, వీటిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక్క ప్రాజెక్టు లేదు.
ఈ ప్రాజెక్టుల్లో భాగంగా రూ.1,294.13 కోట్లతో హుబ్లీ-చికాజూర్ మధ్య 190 కి.మీ పొడవైన (డబ్లింగ్) మార్గాన్ని, రూ.2,675.64 కోట్లతో రమ్నా - సిలిగురి మధ్య 261 కి.మీ (డబ్లింగ్) మార్గాన్ని, రూ.2,084.90 కోట్లతో కట్ని - సిలిగురి మధ్య 261 కి.మీ (డబ్లింగ్) మార్గాన్ని చేపట్టనున్నారు.
అలాగే రూ.1,700.24 కోట్లతో బీహార్లోని రాంపూర్ దుమ్లా - తాల్ - రాజేంద్రపుల్ సెక్టారులో డబ్లింగ్, అదనపు బ్రిడ్జ్లను, రూ.1,443.32 కోట్లతో వార్దా - బల్షారా మధ్య 132 కి.మీ (మూడవ లైన్) మార్గాన్ని, రూ.1,595.76 కోట్లతో మధ్యప్రదేశ్లోని అనుప్పూర్ - కాట్నీ మధ్య 165 కి.మీ (మూడవ లైన్) మార్గాన్ని అభివృద్ధి చేయనున్నారు.
వచ్చే అయిదేళ్లలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలని సిసిఈఎ నిర్ణయించింది. కాగా, గుంటూరు, గుంతకల్ మార్గంలో ద్రోణాచలం వరకూ డబ్లింగ్, ఒంగోలు - నాయుడుపేట మధ్య మూడవ లైన్, నడికుడి - బీబీనగర్ మధ్య డబ్లింగ్, రేణిగుంట - ద్రోణాచలం మధ్య డబ్లింగ్ తదితర ప్రాజెక్టులను తెలుగు రాష్ట్రాలు కోరినప్పటికీ, వాటికి ఆమోదం లభించలేదు.