సిటీలో Rain alert: మూసారాంబాగ్ బ్రిడ్జి మూసివేత, గండిపేట వరదలో ఫ్యామిలీ
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ తోపాటు ఇతర జిల్లాల్లోనూ కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే వర్షాలు రాజధాని నగరంతోపాటు జిల్లాల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే నగరంలోని చాలా కాలనీలో వరదల నీటిలోనే ఉన్నాయి.
భారీ వర్షాలతో అలర్ట్
తాజాగా, మరో మూడు రోజులపాటు హైదరాబాద్ తోపాటు తెలంగాణ ఇతర జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హుస్సేన్ సాగర్ తోపాటు జంట జలాశయాలు కూడా నిండుకుండలను తలపిస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.
మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేత
మరోవైపు, భారీ వర్షాల కారణంగా మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మూసారాంబాగ్ వద్ద బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేశారు పోలీసులు. మంగళవారం రాత్రికి బ్రిడ్జిపైకి వరద నీరు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. మూసీ నది వరద ఉధృతి పెరిగితే చాదర్ ఘాట్ లో లెవెల్ బ్రిడ్జిపై ట్రాఫిక్ నిలిపివేస్తామని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.
ప్రజల కోసం జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ ఏర్పాటు
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే వెంటనే జీహెచ్ఎంసీ కాల్ సెంటర్ 040-21111111ను సంప్రదించాలన్నారు. కంట్రోల్ రూమ్ 24 గంటలపాటు పనిచేస్తుందని చెప్పారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల నుంచి నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో మూసీ పరివాహక, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు.
గండిపేట వరదలో చిక్కుకున్న కుటుంబం
కాగా, గండిపేట వరదలో ఓ కుటుంబం చిక్కుకుంది. దీంతో సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయి. రాత్రి కావడంతో రెస్క్యూ సిబ్బంది వారిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. ఇది ఇలావుండగా, వికారాబాద్ జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కలెక్టర్.
హిమాయత్ సాగర్ లో చిక్కుకున్న వ్యక్తిని కాపాడారు
హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్డుపై వరదలో చిక్కుకున్న వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు కాపాడారు. భారీ వర్షాల కారణంగా సాగర్ ఆరు గేట్లను ఎత్తడంతో భారీ వరద దిగువకు ప్రవహిస్తోంది.