న్యూ ఇయర్ వేళ టెన్షన్: ఒమిక్రాన్ - ఆంక్షలు : ఇప్పుడు తాజా అలర్ట్..!!
కొత్త సంవత్సరం వేళ కొత్త టెన్షన్ మొదలైంది. దాదాపుగా రెండేళ్ల పాటు ప్రభావం చూపిన కరోనావైరస్ తగ్గుముఖం పట్టింది. సరిగ్గా ఇదే సమయంలో ప్రపంచ దేశాల్లో మొదలైన ఒమిక్రాన్ దేశంలోని పలు రాష్ట్రాల్లో విస్తరించింది. ఇక, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు వెలుగు లోకి వస్తున్నాయి. కొత్తగా 6 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 62కు చేరింది. ఆ 62 మందిలో 46 మంది వ్యాక్సిన్ తీసుకోనివారే ఉన్నారు.. దీంతో.. వ్యాక్సిన్ తీసుకోనివారిపై ఈ కొత్త వేరియంట్ త్వరగా ఎటాక్ చేస్తున్నట్టు అంచనా వేస్తున్నారు.

ట్రావెల్ హిస్టరీ లేకున్న ఓమిక్రాన్
మరోవైపు.. ట్రావెల్ హిస్టరీ లేనివారిలోనూ ఒమిక్రాన్ కేసులు వెలుగు చూడడం కలకలం సృష్టిస్తోంది.. హైదరాబాద్లో ట్రావెల్ హిస్టరీలేని ముగ్గురిలో ఒమిక్రాన్ పాజిటివ్గా తేలింది. ఇదే సమయంలో వారం రోజులగా చలితో వణికి పోయిన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పొగ మంచు కప్పేస్తోంది. ఇక, తాజాగా వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే రెండు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

ఉపరితల ద్రోణి. .వర్షాల సూచన
ఉపరితల ద్రోణి నైరుతి రాజస్థాన్ పరిసర ప్రాంతాల నుంచి విదర్భ మీదుగా ఉత్తర తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి సుమారు 1.5 కిమీ ఎత్తు వరకు విస్తరించి ఉందని వెల్లడించారు. దీంతో కింది స్థాయి గాలులు ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ వైపు వీస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో బుధ, గురువారాల్లో ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని, శుక్రవారం పొడి వాతావరణం ఉంటుందని చెప్పారు. ఏపీలోని వర్షాల పైన వాతావారణ శాఖ అలర్ట్ ఇచ్చింది.

భారీగా కురుస్తున్న మంచు.. కనిష్ణ ఉష్ణోగ్రత
బంగాళాఖాతం మీదుగా కోస్తాపైకి వీస్తున్న తూర్పు గాలుల ప్రభావంతో మంగళవారం కోస్తా, రాయలసీమల్లో దట్టంగా మంచు కురిసింది. ఉదయం పది గంటల వరకు మంచు కురవడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తూర్పు గాలులు, మంచు ప్రభావంతో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఆరోగ్యవరంలో 15.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండు రోజుల్లో తూర్పుగాలులు మరింత బలపడే అవకాశముందని.. ఈ నెల 30 నుంచి మూడు రోజులపాటు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

మారుతున్న వాతావరణం..అప్రమత్తత అవసరం
ఇక, కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీలో పూర్తిగా కోవిడ్ ప్రోటోకాల్ అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మాస్కును రెండు రాష్ట్రాలు తప్పని సరి చేసాయి. ఇక, కొత్త సంవత్సరం వేడుకల పైనా ఆంక్షల దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీంతో.. వేగంగా వాతావరణంలో వస్తున్న మార్పులు.. వైరస్ వ్యాప్తి వేళ.. జనసమూహాల్లోకి వెళ్లవద్దని...ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications