తెలంగాణాకు వరుణ గండం .. ప్రమాదకరంగా రామప్ప చెరువు ..20 గ్రామాల ప్రజల తరలింపు
తెలంగాణ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి.నేడు కూడా తెలంగాణలో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారుతోంది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.గోదావరి ఉధృతి కొనసాగుతోంది.
Recommended Video

అల్పపీడన ప్రభావంతో శుక్రవారం కూడా వర్షాలు
ఒడిశా తీరాన ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శుక్రవారం కూడా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కొనసాగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ వరదలు జన జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. వరంగల్ నగరంలో ఇప్పటికే పలు లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరో పక్క ములుగు జిల్లాను వరదలు ముంచెత్తుతున్నాయి.ములుగు జిల్లాలో ప్రమాదకరస్థాయిలో రామప్ప చెరువు రహదారి పైన ప్రవహిస్తోంది.

రామప్ప చెరువుకు వరద .. డేంజర్ లో 20 గ్రామాలు
మేడి వాగు ఉధృతంగా ప్రవహించడంతో ములుగు ఏటూరునాగారం లో మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రామప్ప చెరువు కు వరద నీరు పోటెత్తడంతో నీటిమట్టం నలభై అడుగులకు పైగా చేరింది.రామప్ప నీటి సామర్థ్యం 2.91 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 4.27 టీఎంసీల నీటి మట్టం ఉందని, వరద మరింత పెరిగే ప్రమాదం ఉన్న కారణంతో 20 గ్రామాలకు ప్రమాదం పొంచి ఉందని అధికారులు అంటున్నారు.దీంతో ఇరవై గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

వర్ధన్నపేట కొనారెడ్డి చెరువుకు గండి .. వరంగల్ , ఖమ్మం రాకపోకలు బంద్
వర్ధన్నపేట లోని కోనా రెడ్డి చెరువు కు గండి పడటంతో ఖమ్మం వరంగల్ ప్రధాన రహదారి మీద రాకపోకలు నిలిచిపోయాయి. కోనా రెడ్డి చెరువు పరిస్థితి తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హుటాహుటిన అక్కడికి వెళ్లి యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పునరుద్ధరణ పనులను స్వయంగా పర్యవేక్షించారు .కోనా రెడ్డి చెరువు ప్రభావంతో ఆకేరు వాగు వరద ముంచెత్తుతోంది. దీంతో జిల్లాలోని నెల్లికుదురు, చిన్నగూడూరు, నర్సింహులపేట ,మరిపెడ మండలాల గ్రామాలకు వరద నీరు ముంచెత్తే ప్రమాదముందని వారంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

కొట్టుకుపోతున్న బ్రిడ్జ్ లు , రోడ్లు .. వరద ఎఫెక్ట్
మరోపక్క చిన్నబోయినపల్లి షాపల్లి గ్రామాల మధ్య బ్రిడ్జ్ వరద ఉధృతికి కొట్టుకుపోతుంది. కటాక్షపుర్ చెరువు ఉద్ధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు జిల్లా గోవిందరావుపేట లోని గుండ్ల వాగు ప్రాజెక్టు ఇప్పటికే నిండుకుండలా మారింది. ప్రాజెక్టు సమీప ప్రాంత ప్రజలను వరద ముంచెత్తే ప్రమాదం ఉండటంతో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతోంది. దీంతో దిగువకు వెళ్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి పోటెత్తుతోంది.

ఉగ్ర రూపం దాల్చిన గోదావరి .. నిరాశ్రయులైన వేలాదిమంది ప్రజలు
శాంతించినట్లు శాంతించి గోదావరి మరోమారు ఉగ్రరూపం దాల్చడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లాలో పరిస్థితి దారుణంగా తయారైంది. వేలాది ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కు కోవడమే కాకుండా పంట పొలాలు నీట మునిగాయి. ప్రజలు నిరాశ్రయులయ్యారు. అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నా ఒకపక్కన వర్షాలు, మరో పక్కన కరోనా ప్రభావం, ఇంకోవైపు అరకొర వసతులతో సహాయక శిబిరాల్లో ప్రజలు దుఃఖితులౌవుతున్నారు .వాతావరణ శాఖ ఈ రోజు కూడా భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పడంతో మరింత ఆందోళన నెలకొంది. ఈ వర్షాలతో ఇంకెంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయో అని ప్రజలు భయకంపితులు అవుతున్నారు.












Click it and Unblock the Notifications