సారిక మృతిపై కాంగ్రెస్ సీరియస్: రాజయ్య సస్పెన్షన్, బిగుస్తున్న ఉచ్చు
వరంగల్/న్యూఢిల్లీ: వరంగల్ మాజీ పార్లమెంటు సభ్యుడు, తమ పార్టీ సీనియర్ నేత సిరిసిల్ల రాజయ్య పైన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వేటు వేసింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. రాజయ్య నివాసంలో... ఆయన కోడలు సారిక, మనవళ్ల మృతిని పార్టీ అధిష్టానం సీరియస్గా తీసుకుంది.
రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లలు గత బుధవారం నాడు వేకువజామున అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇది కాంగ్రెస్ పార్టీకు షాకిచ్చింది. వరంగల్ ఉప ఎన్నికల్లో రాజయ్య పోటీ చేయవలసి ఉంది.
కానీ ఈ పరిణామం నేపథ్యంలో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. మరో సీనియర్ నేత సర్వే సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. ఇంట్లో ప్రమాదంపై... సారిక, సారిక కుటుంబ సభ్యులు మహిళా సంఘాలు రాజయ్య కుటుంబం వైపు వేలెత్తి చూపాయి. ఆయన కుటుంబం ప్రస్తుతం జైలులో ఉంది.
వరంగల్ ఉప ఎన్నికల నేపథ్యంలో రాజయ్యను పార్టీలోనే ఉంచుకుంటే ప్రభావం పడుతుందని కాంగ్రెస్ పార్టీ భావించినట్లుగా తెలుస్తోంది. రాజయ్య పైన పడిన మచ్చ తమకు అంటకుండా ఉండేందుకు ఆయనను సస్పెండ్ చేయడమే మంచిదని అధిష్టానం భావించింది. తద్వారా నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది.
ఈ నేపథ్యంలో రాజయ్య పైన సస్పెన్షన్ వేటు పైన నాలుగు రోజులుగా పార్టీలో చర్చ సాగుతోంది. రాజయ్య నివాసంలో జరిగిన ప్రమాదంపై పార్టీ అధిష్టానం రాష్ట్ర నేతల నుంచి పూర్తి వివరాలు ఆరా తీసింది. అనంతరం తర్జన భర్జన అనంతరం ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
ఇదిలా ఉండగా, వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో బయోటెక్నాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్న మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య భార్య సిరిసిల్ల మాధవిపై సస్పెన్షన్ వేటు పడే అవకాశాలున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.
రాజయ్య కుటుంబం చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
మాజీ ఎంపీ రాజయ్య, ఆయన కుటుంబం చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే అనిల్ రెండో భార్య సనను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు రాజయ్యను పార్టీ సస్పెండ్ చేసింది. ఇంకోవైపు పోలీసులు విచారణను వేగవంతం చేశారు.