కేసీఆర్కు ప్రశంస: రంగంలో భవిష్యవాణి స్వర్ణలత ఏం చెప్పారంటే
హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఘనంగా జరుగుతున్న లష్కర్ బోనాల్లో అత్యంత కీలకమైన రంగం కార్యక్రమం సోమవారం ఉదయం అంగరంగా వైభవంగా జరిగింది. బోనాల తర్వాత రోజు జరిగే ఈ ఘట్టంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.
లష్కర్ బోనాల సందర్భంగా పచ్చి కుండపై నిలబడి, అమ్మవారిని ఆవహించుకుని భవిష్యత్తును చెప్పిన స్వర్ణలత, తెలంగాణ భవిష్యత్తు బంగారమని, ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని అన్నారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉంటారని, ఎవరికి ఆపద రాకుండా తాను చూసుకుంటానని స్వర్ణలత అన్నారు.

'మిమ్మల్ని సుఖ సంతోషాలతో ఉంచుతున్నా.. అయినా నాకు రక్త తర్పణం చేయటం లేదు. ఏటా రక్త తర్పణం చేయాలని నేనేమైనా అడుగుతున్నానా..? అంటూ భవిష్యవాణి ప్రజలను ఈ సందర్భంగా నిలదీసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అయుత చండీయాగాన్ని నిర్వహించడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని, ప్రజల్లో భక్తి ప్రపత్తులు పెరిగాయని మాతంగి స్వర్ణలత వెల్లడించారు.
వానలు కురిపించి తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చగా ఉంచుతున్నా.. కలరా లాంటి అంటువ్యాధులు రాకుండా ఉండాలంటే నేను అడిగింది చేయాలి. అప్పుడే ప్రజలంతా సుఖసంతోషాలతో ఉంటారు' అని స్వర్ణలత భవిష్యవాణిని వినిపించింది. చివరగా నేనేమీ వెజిటేరియన్ను కాదు కదా అంటూ తనకి నాన్వెజ్ తినిపించాలని సూచించింది.
మరోవైపు లష్కర్ బోనాల్లో అత్యంత కీలకమైన రంగం కార్యక్రమమైన భవిష్యవాణిని వినేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి తదితరులు పాల్గొన్నారు. రంగం కార్యక్రమం అనంతరం అమ్మవారిని ఆలయ పురవీధుల్లో అంబారిపై ఊరేగించి, సాగనంపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
లష్కర్ బోనాల్లో చిందేసిన మంత్రి తలసాని
సికింద్రాబాద్లో లష్కర్ బోనాల సందడి కొనసాగుతోంది. ఆదివారం ప్రారంభమైన బోనాల్లో భాగంగా జనం భక్తిప్రపత్తులతో ఆయా ప్రాంతాల్లోని ఆలయాలకు జారతగా వెళుతున్నారు. ఈ క్రమంలో సికింద్రాబాదులోని సీతాఫల్ మండిలో జరిగిన బోనాల్లో భాగంగా టీఆర్ఎస్ నేత, తెలంగాణ కేబినెట్ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ చిందేశారు.
భారీ అనుచరగణంతో కదిలి వచ్చిన ఆయన డప్పు దరువులకు అనుగుణంగా చిందేసి ఆడారు. మంత్రి తలసాని డ్యాన్స్ చేయడంతో ఆయన అనుచరులు కేరింతలు కొట్టారు. ప్రతిఏటా జరిగే బోనాల్లో మంత్రి తలసాని లీనమై పాలుపంచుకుంటుంటారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది బోనాల్లోనూ ఆయన ఉత్సాహంగా పాలుపంచుకున్నారు.












Click it and Unblock the Notifications