మోడీ వ్యాఖ్యల వెనుక: వ్యూహత్మకమా, బిజెపి ప్లాన్ ఇదే
హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ప్రారంభోత్సవంతో పాటు, మెట్రో రైలు ప్రారంభోత్సవానికి గత నెల 28వ, తేదిన హైద్రాబాద్కు వచ్చారు. ఆ సమయంలో మోడీ చేసిన ప్రసంగంపై చర్చ సాగుతోంది. వ్యూహత్మకంగానే మోడీ తన ప్రసంగంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ను గుర్తు చేశారా, యాధృచ్ఛికంగానే ఆ పేరును వాడారా అనే విషయమై చర్చ సాగుతోంది.
నవంబర్ 28వ, తేదిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు, మెట్రో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమాలను గత నెల 28వ,తేదిన హైద్రాబాద్లో నిర్వహించారు. మెట్రో రైలును ప్రారంభించిన తర్వాత జీఈఎస్ 2017 సదస్సులో ప్రధానమంత్రి మోడీ పాల్గొన్నారు.
మెట్రో రైలును ప్రారంభించేందుకు వెళ్ళడానికి ముందే మోడీ బేగంపేట విమానాశ్రయంలోనే పార్కింగ్ ఏరియాలో బిజెపి కార్యకర్తలతో మోడీ కొద్దిసేపు ప్రసంగించారు.ఈ ప్రసంగం చర్చనీయాంశంగా మారింది.
మోడీ వ్యాఖ్యల వెనుక ఉద్దేశ్యమేమిటీ?
బిజెపి కార్యకర్తల సమావేశం సందర్భంగా మోడీ చేసిన వ్యాఖ్యల వెనుక ఉద్దేశ్యమేమిటనే విషయమై సర్వత్రా చర్చ సాగుతోంది. తన ప్రసంగంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ను మోడీ గుర్తుకు తెచ్చుకొన్నారు. ఈ ప్రసంగం టీఆర్ఎస్ గొంతులో పచ్చివెలక్కాయ పడ్డ చందంగా మారిందని బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో నిజాం గురించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నేతలు తప్పుబట్టారు.
మోడీ వ్యాఖ్యలతో రాజకీ ప్రాధాన్యం
నిజాంను తెలంగాణకు రాజుగా చెబుతూ కెసిఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలు బిజెపికి ఇబ్బందిగా మారాయి. అయితే ఓ పార్టీ మెప్పు కోసమే కెసిఆర్ ఈ రకంగా వ్యాఖ్యలు చేస్తున్నారని బిజెపి విమర్శలు చేసింది. అయితే మెట్రోరైలు ప్రారంభోత్సవం సందర్భంగా విచ్చేసిన ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.అయితే ఉద్దేశ్యపూర్వకంగానే మోడీ ఈ వ్యాఖ్యలు చేశారా, లేక యాధృచ్చికంగా ఈ వ్యాఖ్యలు చేశారా అనే విషయమై చర్చ సాగుతోంది.
బిజెపి నేతల్లో జోష్ నింపిన మోడీ
మెట్రో రైలు ప్రారంభోత్సవానికి వచ్చిన సమయంలో మోడీ చేసిన ప్రసంగం బిజెపి నేతల్లో జోష్ నింపింది. ప్రత్యేక విమానం దిగిన మోదీ త్వరత్వరగా గవర్నర్నీ, సీఎంనీ, మంత్రులనీ కలిసి నేరుగా పార్టీ వేదిక వద్దకు వెళ్లారు. పార్టీ కార్యకర్తలకు అభివాదం చేశారు. అనంతరం తెలుగులో ప్రసంగం మొదలుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. "హైదరాబాద్ అంటే నాకు సర్థార్ వల్లభాయ్పటేల్ గుర్తుకొస్తున్నారు. హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో కలిపిన సర్దార్ పటేల్కు ఈ వీరభూమి నుంచి ప్రణమిల్లుతున్నాను. తెలంగాణ విమోచనలో అమరులైన వీరులకు నా జోహార్లు'' అంటూ ప్రసంగాన్ని కొనసాగించారు.అయితే ఈ ప్రసంగం కోసం బిజెపి రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వానికి లేఖ రాసిందని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. దీనికి అనుగుణంగానే మోడీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేలా ప్రసంగించారని అంటున్నారు.
కేంద్రానికి నివేదికలు
తెలంగాణలో చోటు చేసుకొంటున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు కేంద్రానికి రహస్య నివేదికలు మోడీకి చేరుతున్నాయని బిజెపి వర్గాల్లో ప్రచారంలో ఉంది.సమయం చిక్కినప్పుడల్లా నిజాంను టిఆర్ఎస్ పొగిడిన విషయాలపై కూడ బిజెపి నేతలు నివేదికలను జాతీయ నాయకత్వానికి పంపారనే ప్రచారం కూడ ఉంది. నరేంద్రమోదీ హైదరాబాద్ వచ్చిరాగానే పరోక్షంగా నిజాంపై తన వాగ్బాణాలు సంధించడంపై బిజెపి నేతలు సంబరాల్లో ఉన్నారు.మరోవైపు తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని చెప్పడం ద్వారా టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా తమ పార్టీ ఉందనే సంకేతాలు ఇచ్చినట్టైందని బిజెపి నేతలు అభిప్రాయపడుతున్నారు.