రేవంత్ రెడ్డి కన్నీటి వెనుక మతలబు ఇదేనా? టార్గెట్ వారేనా? మునుగోడు ఎన్నికలవేళ ఆసక్తికరచర్చ!!
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనపై కుట్ర జరుగుతుందని షాకింగ్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు తనను పదవి నుంచి దించాలని సీఎం కేసీఆర్ తో కలిసి సొంత పార్టీ నేతలు కుట్ర పన్నుతున్నారని, తాను ఒంటరివాడిని అయ్యానని రేవంత్ రెడ్డి కన్నీటి పర్యంతం కావడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. అసలు రేవంత్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకోవడం వెనక ఆంతర్యం ఏమిటి అన్న చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్ నేతలపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
మునుగోడు ఉప ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతుంది. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన సిట్టింగ్ స్థానం చేజిక్కించుకోవడం కోసం శతవిధాలా ప్రయత్నిస్తోంది.మునుగోడు నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలోపాల్గొంటున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో తనను ఒంటరిని చేయడం కోసం కొందరు కుట్రలు పన్నుతున్నారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా సాక్షిగా కన్నీరు పెట్టుకున్నారు. కొందరు సీనియర్ నాయకులు తనకు పీసీసీ పదవి వచ్చినందుకు కక్ష పెంచుకుని కుట్రలు చేస్తున్నారని ఆరోపించిన రేవంత్ రెడ్డి, ప్రతి ఒక్క కార్యకర్తకూచేతులు జోడించి చెబుతున్నాఅందరూ అప్రమత్తం కావాలని పేర్కొన్నారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించి తనను టిపిసిసి అధ్యక్షుడు నుంచి తొలగించాలని కుట్రలు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యల వెనుక మతలబు ఇదే
అయితే ఈ వ్యాఖ్యల వెనుక రేవంత్ రెడ్డికి మునుగోడులో ఓటమి భయం కనిపిస్తుంది అన్న చర్చ జోరుగా సాగుతుంది. ఒకవేళ మునుగోడులో ఓటమి పాలైతే పార్టీ అధిష్టానం వద్ద తన పరపతి తగ్గుతుందని, తనను టీపిసిసి అధ్యక్షుడిగా తొలగించే అవకాశం ఉంటుందని భావించి రేవంత్ రెడ్డి, మునుగోడులో సానుభూతి కోసం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో రేవంత్ రెడ్డికి అండగా ఉండాలనే భావాన్ని పెంపొందించడం కోసం ఈ ప్రయత్నాన్ని చేసినట్టుగా కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అంతేకాదు మునుగోడు ఉప ఎన్నికల పోరాటంలో సీనియర్ నాయకులు కలిసి రావడం లేదన్న విషయాన్ని, తనకు ఎవరూ సహకరించడం లేదు అన్న విషయాన్ని రేవంత్ రెడ్డి ఇప్పటినుంచే చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పరోక్షంగా టార్గెట్
ఇక తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలలో మునుగోడు లో పెద్ద కుట్ర జరుగుతోందని ఆరోపించిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఖతంచేసే ఎత్తులు వేస్తున్నారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఎన్నికల ప్రచారానికి రంగంలోకి దిగవలసిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు పార్టీ ప్రచారానికి రాకపోవడం, ముఖ్యంగా మునుగోడు ఉప ఎన్నికల బాధ్యతను భుజాన వేసుకోవలసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల ప్రచారం నుంచి పక్కకు తప్పుకోవడం, మునుగోడు ఉపఎన్నిక పట్టింపు లేకుండా ప్రవర్తించడం వెరసి రేవంత్ రెడ్డి తీవ్ర అసహనంతో ఉన్నారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి పరోక్షంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని టార్గెట్ చేసి తనపై కుట్ర జరుగుతుందని వ్యాఖ్యలు చేసినట్లుగా చర్చ జరుగుతోంది.
పార్టీ కార్యకర్తల, ప్రజల మద్దతు కోసం రేవంత్ కష్టాలు
కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి జరుగుతున్న ఎత్తులను చిత్తు చేయాలని, పార్టీని బతికించేందుకు ప్రతి కార్యకర్త శ్రమించాలని రేవంత్ రెడ్డి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా రేవంత్ రెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్న పార్టీ కార్యకర్తలలో పార్టీ కోసం పని చేయాలన్న పట్టుదలను తీసుకువచ్చే ప్రయత్నం చేశారని, అలాగే ఓటర్ లలోనూ సానుభూతి తీసుకువచ్చే ప్రయత్నం చేశారని భావిస్తున్నారు. ఇక తాను ఒంటరివాడిని అయ్యానని కన్నీటిపర్యంతమైన రేవంత్ రెడ్డి, తన చర్య తోటి సానుభూతి ఓట్లను దండుకునే ప్రయత్నం చేస్తున్నట్లు గా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
నిజాలు తెలుస్తాయన్న రేవంత్ రెడ్డి.. ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయా?
మునుగోడు ఉప ఎన్నికలలో ఓటమి పాలైతే ఆ తర్వాత ఏం జరుగుతుంది భవిష్యత్ పరిణామాలను అంచనా వేసిన రేవంత్ రెడ్డి, సొంత పార్టీ నాయకులు తన పైన ఎంత వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి టీపిసిసి అధ్యక్షుడిగా ఉన్న కారణంగానే తెలంగాణలో కాంగ్రెస్ బలహీనపడింది అని ప్రజలలో చెడ్డపేరు తెచ్చేందుకు సొంత పార్టీ నేతలు కెసిఆర్ తోకలిసి కుట్ర చేస్తున్నారని, త్వరలోనే అన్ని నిజాలు తెలుస్తాయి అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలలో త్వరలోనే నిజాలు తెలుస్తాయి అని చెప్పడం రేవంత్ రెడ్డి వద్ద దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా అన్న చర్చకు కారణంగా మారింది.