గోదావరికి రికార్డ్ స్థాయిలో వరద.. ఏపీ, తెలంగాణాల్లో ఉగ్రగోదావరితో పరీవాహక ప్రాంతాల ప్రజల ఆందోళన!!
గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నదికి వరద పోటెత్తింది. గతంలో ఎప్పుడూ లేనంతగా జూలై నెలలో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. వందేళ్ళలో గోదావరి నదికి ఇంతగా వరద రావటం ఇదే మొదటిసారి కావచ్చు అని అంచనా వేస్తున్నారు . రెండు తెలుగు రాష్ట్రాలలో గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది.
ఏపీ, తెలంగాణా లలో గోదావరి ఉధృతి
తెలంగాణ రాష్ట్రంలోని బాసర నుండి భద్రాచలం, ఆపై పోలవరం నుంచి ధవళేశ్వరం వరకూ గోదావరి ప్రమాదకరస్థాయిలో ఉగ్రరూపం దాలుస్తోంది. భద్రాచలం దగ్గర మంగళవారం సాయంత్రం నీటిమట్టం కాస్త తగ్గడంతో మూడో ప్రమాద హెచ్చరికను తొలగించారు అధికారులు. అయితే మళ్లీ ఎగువ నుంచి వరద పెరగడంతో గోదావరి నీటిమట్టం మళ్లీ మరింత వేగంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో ఎగువ రాష్ట్రాలు భారీగా వరద నీటిని విడుదల చేస్తున్నాయి.
కాళేశ్వరం,రామన్నగూడెంలలో రెండో ప్రమాద హెచ్చరిక
ఇక కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. కాళేశ్వరం వద్ద అధికారులు రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. రెండవ ప్రమాద హెచ్చరిక ను దాటి 13.8 20 మీటర్ల ఎత్తున గోదావరి నది ప్రవహిస్తోంది. దీంతో అధికారులు పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇక ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద ఉదయం 6 గంటలకు 15.900 మీటర్ల మేర గోదావరి నీటి మట్టం పెరిగింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. రామన్నగూడెం వద్ద గోదావరి నీటిమట్టం 17.360 మీటర్లకు చేరితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉంటుంది.
భద్రాచలం వద్ద గోదావరికి రెండో ప్రమాద హెచ్చరిక
భద్రాచలం దగ్గర ఉదయం 9 గంటలకు గోదావరి నీటిమట్టం 51.5 అడుగులకు చేరుకుంది. దీంతో ప్రస్తుతం భద్రాచలం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. అయితే వస్తున్న వరదతో సాయంత్రానికి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే పోలవరం వద్ద గోదావరి నది నీటి మట్టం అంతకంతకు పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం పోలవరం స్పిల్ వే గేట్ల ద్వారా 12 లక్షల 69 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. పోలవరం ముంపు గ్రామాలలోనూ గోదావరి వరదల నేపధ్యంలో ఆందోళన కొనసాగుతుంది.
బిక్కుబిక్కుమంటున్న గోదావరీ పరీవాహక ప్రాంతాల ప్రజలు
దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం వెళ్లదీస్తున్నారు. ఎప్పుడు వరద ముంచెత్తుతోందో అని భయపడుతున్నారు. ఇప్పటికే గోదావరి పరీవాహక ప్రాంతాలు, మారుమూల గ్రామాల్లోని వారికి ఇప్పటికే ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మహా ముత్తారం, మహాదేవపూర్, కాటారం మండలాల్లో 15 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పోలవరం మండలంలో భయం భయం.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక
ఇప్పటికే
పోలవరం
మండలంలోని
అనేక
గ్రామాలకు
రాకపోకలు
తెగిపోయాయి
.ఇక
ధవళేశ్వరం
వద్ద
గోదావరి
ఉధృతి
అంతకంతకు
పెరగడంతో
గేట్లు
ఎత్తి
నీటిని
విడుదల
చేస్తున్న
అధికారులు
ధవళేశ్వరం
వద్ద
రెండవ
ప్రమాద
హెచ్చరికను
జారీ
చేశారు.
సముద్రంలోకి
ఇప్పటికే
15
లక్షల
క్యూసెక్కుల
నీటిని
విడుదల
చేశారు.
నిన్న
ఉదయం
11గంటల
నుండి
ధవళేశ్వరం
వద్ద
రెండో
ప్రమాద
హెచ్చరిక
కొనసాగుతుంది.