అదే నిజం!: ప్రభాకర్ రెడ్డి మృతిపై రిపోర్టు రెడీ.. రిపోర్టులో ఏముందంటే?
కుకునూర్ పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డిది హత్యే అని వినిపిస్తున్న ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదని విచారణలో తేలినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: బ్యుటీషియన్ శిరీష ఉదంతంలో అనుమానాలు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. కుకునూర్ పల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డిది హత్యే అని వినిపిస్తున్న ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదని విచారణలో తేలినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభాకర్ రెడ్డి మృతిపై విచారణాధికారి రిపోర్టును సిద్దం చేసినట్లు సమాచారం.
క్లియర్: శిరీష ఫాంహౌస్ కు వెళ్లలేదు, ఆ లొకేషన్ ఎస్సై క్వార్టర్స్ దే: వెస్ట్ జోన్ డీసీపీ
ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య తర్వాత అతని కుటుంబ సభ్యులు.. కొంతమంది గ్రామస్తులు ఆయనది హత్యే అంటూ అనుమానాలు లేవనెత్తారు. కొంతమంది అల్లరిమూకలు ఓ టీవి ఛానెల్ ఓబీ వ్యాను సహా పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. ఉన్నతాధికారుల వేధింపులు తాళలేకే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ వారంతా బలంగా వాదించారు. కానీ విచారణలో మాత్రం 'శిరీష' ఉదంతమే ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు దారితీసినట్లు తేలిందంటున్నారు.
ఏసీపీ మీద ఆరోపణలు:
ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య తర్వాత ఉన్నతాధికారుల వేధింపులే ఇందుకు కారణమని ఆయన కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు. గజ్వేల్ ఏసీపీ వేధింపువల వల్లే ప్రభాకర్ రెడ్డి బలైపోయారని వారు ఆరోపిస్తూ వస్తున్నారు. అయితే విచారణలో మాత్రం వేధింపులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు బయటపడలేదని తెలుస్తోంది.
మెటర్నిటీ సెలవుల విషయంలో, పాత కేసుల క్లోజింగ్ విషయంలో ఏసీపీ వేధించినట్లు ఆధారాలున్నాయి కానీ చార్జీ మెమోల విషయంలో మాత్రం ఆధారాలేమి లేవని గుర్తించినట్లు చెబుతున్నారు.
పరువు పోతుందనే ఆత్మహత్య:
ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు శిరీష ఉదంతమే కారణమని విచారణలో తేలినట్లు చెబుతున్నారు. శిరీష వ్యవహారం బయటకు వస్తే..ఎక్కడ తన పరువు పోతుందోనన్న భయంతోనే ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడినట్లు నివేదికలో పేర్కొన్నారని తెలుస్తోంది. డీజీపీ అనురాగ్ శర్మ ఆదేశాల మేరకు అదనపు డీజీపీ గోపీకృష్ణ సహా సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్న ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యపై విచారణ చేపట్టి.. తుది నివేదిక సిద్దం చేశారు.
ఏసీపీ వేధింపులపై ఆధారాలు లేవు:
విచారణలో భాగంగా.. కుకునూర్ పోలీస్ స్టేషన్ ను, ఎస్ఐ నివాసముంటున్న క్వార్టర్స్ ను వారు డీఎస్పీలు ఇద్దరు పరిశీలించారు. శిరీష కేసులో నిందితులుగా ఉన్న శ్రవణ్, రాజీవ్ లు ఇద్దరిని, కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ సిబ్బందిని కూడా ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఉన్నతాధికారుల వేధింపుల కోణంలోను విచారణ జరపగా.. ఎక్కడా అలాంటి ఆధారాలు దొరకలేదని చెబుతున్నారు.
ఇద్దరు కానిస్టేబుళ్లు, అల్లరిమూకలపై కేసులు:
ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య నేపథ్యంలో.. పోలీసు, మీడియా వాహనాలపై దాడికి పాల్పడ్డవారిపై కేసులు పెట్టేందుకు యంత్రాంగం సిద్దమవుతోంది. కుకునూర్ పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన,దాడులను పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. దీంతో దాడులకు పాల్పడినవారిపై కేసులు నమోదు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయినట్లు సమాచారం.
ఎస్ఐ ఆత్మహత్య వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించేలా.. ఇద్దరు కానిస్టేబుళ్లు దీన్ని హత్య అని ప్రచారం చేసినట్లుగా విచారణలో తేలిందంటున్నారు. ఈ మేరకు సదరు కానిస్టేబుళ్లపై కుట్ర కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు సంబంధించి శుక్రవారం నాడు డీజీపీకి నివేదిక అందించనున్నారు.