తెలంగాణా సచివాలయ కూల్చివేతపై తీర్పు రిజర్వ్... సర్వత్రా ఉత్కంఠ
తెలంగాణా సర్కార్ సచివాలయాన్ని కూల్చివేసి పునర్నిర్మించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ వ్యవహారంపై తెలంగాణా హైకోర్టులో పలు పిటీషన్లు దాఖలైనాయి. సచివాలయ కూల్చివేత పిటీషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. అనంతరం తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టుతీర్పును రిజర్వ్ చెయ్యటంతో కోర్టు ఏం తీర్పు ఇవ్వనుంది అన్న ఉత్కంఠ కలుగుతుంది.
తెలంగాణా బడ్జెట్ సమావేశాలు ప్రారంభం: ప్రభుత్వ పనితీరుపై గవర్నర్ ప్రసంగం
సచివాలయ కూల్చివేతలపై పిటీషన్లు .. విచారించిన కోర్టు
సచివాలయ భవనాల్ని కూల్చరాదని కోరుతూ కాంగ్రెస్ట్ పార్టీ ఎమ్మెల్సీ టి. జీవన్రెడ్డి, ఎంపీ ఎ. రేవంత్రెడ్డి, ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహన్, న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్రెడ్డిలతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఇక తెలంగాణా రాష్ట్ర సచివాలయాన్ని కూల్చి వెయ్యాలని క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం పూర్తిగా చట్ట విరుద్ధమని పిటిషనర్లు వాదించారు.
ప్రజాధనం దుర్వినియోగం అని వాదించిన పిటీషనర్ల తరపు న్యాయవాదులు
ప్రజాధనం అనవసరంగా దుర్వినియోగం చెయ్యటమే అన్నారు .ఇప్పటి వరకు ఈ వ్యవహారంలో నాలుగు పిటిషన్ లు దాఖలు కాగా వాటిపై ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.ఇక ఈ వ్యవహారంలో ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం నివేదిక కోరగా హైకోర్టుకు అగ్ని ప్రమాదాలు జరిగితే నివారణ చర్యలు తీసుకోలేకపోతున్నామని, భవనాలు సరిపోవటం లేదని ,పాత భవనాలు కావటంతో నీరు కారుతున్నాయని ప్రభుత్వం చాలా కారణాలు చెప్పింది.
ప్రభుత్వం కూల్చివేతపై చెప్పేవన్నీ కుంటి సాకులే అన్న న్యాయవాది
అయితే కుంటి సాకులు చెప్పి నిక్షేపంగా ఉన్న భవనాల్ని కూల్చి, తిరిగి కొత్తగా సచివాలయాన్ని నిర్మిస్తామని ప్రభుత్వం చెప్పడాన్ని పిటిషనర్ల తరఫు న్యామవాదులు తీవ్రంగా తప్పుబట్టారు. ఇప్పుడు మళ్ళీ కొత్త భవనాలు కట్టాలంటే రూ. 400 కోట్ల నుంచి రూ. 500 కోట్ల ఖర్చు అవుతుందని పిటీషనర్ తరపు న్యాయవాది తెలిపారు. ఇలాంటి కారణాలు చెప్పి భవనాల్ని కూల్చేయకూడదని పేర్కొన్నారు. ఇక ఈ చర్యలవల్ల ప్రజాధనం వృథా అవుతుందని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది వాదించారు.
మరమ్మత్తులు చెయ్యాలి కానీ చిన్న కారణాలకే కూల్చేస్తారా ?
ప్రజాధనాన్ని వృథా చేయడమంటే నేరానికి పాల్పడినట్లేనని, ఇలాంటి సందర్భాల్లో ఆరు నెలలు జైలు శిక్ష విధించేలా చట్టాలున్నాయని పిటీషనర్ తరపు న్యాయవాదులు వాదించారు. గ్రామాల్లో మరుగుదొడ్లు దూరంగా ఉంటె ఇళ్ళను కూల్చేస్తారా అని ప్రశ్నించిన న్యాయవాది చిన్న చిన్న రిపేర్లు ఉంటే చేసుకోవాలి కానీ ఈ విధంగా కట్టడాలను కూల్చటం సమంజసం కాదన్నారు . పిల్స్కు విచారణ అర్హత లేదని ప్రభుత్వం చెప్పడంపై పిటీషనర్ తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
Recommended Video
సచివాలయం ఖాళీ చెయ్యటంతో పాలన అస్తవ్యస్తం అని వాదన .. తీర్పు రిజర్వ్
ఢిల్లీ సచివాలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉన్నదని పాతబడిందని చెప్పి ఒక్క ఇటుకను కూడా తొలగించలేదన్నారు.చార్మినార్ను నిర్మించి 400 ఏళ్లకు పైబడిందని, ఇలాంటి చారిత్రక కట్టడాలకు మరమ్మతులు చేయాలేగానీ కూల్చేసి మళ్లీ కట్టేస్తామనడం అవివేకమని వ్యాఖ్యానించారు. సచివాలయాన్ని కూల్చివెయ్యాలని నిర్ణయం తీసుకుని ఖాళీ చేయడం వల్ల పాలన అస్తవ్యస్తంగా తయారైందని, అన్ని శాఖలు తలా ఒక చోటుకు చేరాయని పేర్కొన్నారు. ఏది ఏమైనా సచివాలయ కూల్చివేత వ్యవహారంలో జరిగిన వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది.