నోట్ల రద్దు: డిసెంబర్ 30 దాటినా... విత్డ్రా 'మరో' షాకింగ్
విత్ డ్రా పరిమితిని డిసెంబర్ 30వ తేదీ తర్వాత ఎత్తి వేస్తారని అనుకున్నారు. కానీ ఆ తర్వాత కూడా మరికొద్ది రోజులు ఈ ఆంక్షలు ఉండే అవకాశముంది.
న్యూఢిల్లీ: రూ.500, రూ.1000 నోట్ల రద్దు అనంతరం ఏటీఎంల నుంచి, బ్యాంకుల నుంచి డ్రా చేసుకునే పరిమితి పైన ఆంక్షలు ఉన్నాయి. వారానికి ఏటీఎం నుంచి రూ.24 వేలు, రోజుకు రూ.2,500 మాత్రమే తీసుకోవాలని పరిమితి ఉంది.
నోట్ల రద్దు-అసలు విషయం ఇదీ: ఆర్బీఐ చెప్పిన గంటల్లోనే మోడీ షాకిచ్చారు!
ఈ పరిమితిని డిసెంబర్ 30వ తేదీ తర్వాత ఎత్తి వేస్తారని అనుకున్నారు. కానీ ఆ తర్వాత కూడా మరికొద్ది రోజులు ఈ ఆంక్షలు ఉండే అవకాశముంది. అనుకున్నంత వేగంగా కరెన్సీ ప్రింట్ కాకపోవడం ఇందుకు కారణంగా తెలుస్తోంది.
కేంద్రం నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని దాదాపు యాభై రోజులు అవుతోంది. అయినా ఇప్పటికీ చాలాచోట్ల ఏటీఎంలు పని చేయడం లేదు. ఆర్బీఐ కొత్తగా ప్రవేశపెట్టిన కొత్త నోట్ల వల్ల కష్టాలు తీరకపోగా మరింత పెరిగాయని ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
పైగా విత్డ్రా పై విధించిన పరిమితులు ప్రజలకు గుదిబండగా మారాయి. అయితే ఇటీవల బ్యాంకులు, ఏటీఎం సెంటర్లలో నగదు విత్ డ్రాపై విధించిన పరిమితులను డిసెంబర్ 30తో ఎత్తివేయనున్నట్లు వార్తలు వచ్చాయి.
అయితే, తాజాగా మరో విషయం వెలుగు చూసింది. డిసెంబర్ 30 తర్వాత కూడా ఆంక్షలు కొనసాగనున్నాయని తెలుస్తోంది. నోట్ల డిమాండ్కు తగినంత సప్లయ్ లేకపోవడమే ఇందుకు కారణం. ఇప్పటికే కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్ల్లో రెండు వేల నోట్ల ముద్రణను తగ్గించారు.
రూ.500 నోట్ల ముద్రణను పెంచారు. అయినప్పటికీ ఇవి అందుబాటులోకి రావాలంటే మరింత సమయం పట్టే అవకాశముందని తెలుస్తోంది.
చాలామంది విత్ డ్రా పరిమితులు పూర్తిగా తొలగిస్తారని భావిస్తున్నారని, కానీ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కొంత ఉపశమనాన్ని కల్పించే ప్రయత్నాలే కేంద్రం నిర్వర్తిస్తోందని చెబుతున్నారు. అందులో భాగంగానే సర్చార్జీ అంశాన్ని తెరపైకి తెచ్చారంటున్నారు.