కూతురు నిశ్చితార్థం: రేవంత్కు 12గంటల పాటు బెయిల్, షరతు
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్టయిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి మధ్యంతర బెయిల్కు ఏసీబీ ఓకే చెప్పింది. పూర్తిస్థాయి బెయిల్కు మాత్రం అంగీకరించలేదు. గురువారం నాడు రేవంత్ కూతురు నైమిషా రెడ్డి నిశ్చితార్థం ఉంది.
రేవంత్ న్యాయవాదులు పూర్తిస్థాయి బెయిల్ కోసం వాదనలు వినిపించారు. రాజకీయ కుట్రతో ఇరికించారని, ఇది దురుద్ధేశ్యంతో కూడుకున్నదని వారు చెప్పారు. రేవంత్ను, ఆయన పార్టీని భ్రష్టు పెట్టించేందుకు కుట్రతో చేసిన వ్యవహారం అన్నారు. కేసుతో రేవంత్కు సంబంధం లేదన్నారు.
అయితే, రేవంత్కు పూర్తిస్థాయి బెయిల్ ఇవ్వొద్దని ఏసీబీ న్యాయస్థానానికి తెలిపింది. అతనికి బెయిల్ ఇస్తే కేసు తారుమారు అవుతుందని చెప్పారు.
ఏసీబీ వాదన నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూతురు నిశ్చితార్థం ఉందని, కాబట్టి కనీసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రేవంత్ తరఫు న్యాయవాదులు చెప్పారు.
అయితే, మధ్యంతర బెయిల్కు ఏసీబీ అభ్యంతరం లేదని చెప్పింది. కూతురు నిశ్చితార్థం నేపథ్యంలో ఇవాళ సాయంత్రం నుండి రేపటి వరకు బెయిల్ ఇవ్వవచ్చునని చెప్పింది. ఎవరితోను భేటీలు కాకుండా చూడాలని, సమావేశాలు కావొద్దని షరతు విధించాలని కోరింది. కాగా, రేవంత్ రెడ్డి తరఫున సుప్రీం కోర్టు న్యాయవాది వాదనలు వినిపంచారు. ఓటుకు నోటు వ్యవహారం జుగుప్సాకరమైనదని కోర్టు వ్యాఖ్యానించింది. ఓటుకు నోటు కేసులో ఉన్నవారు బెయిల్కు అనర్హులని తెలిపింది.
రేవంత్కు బెయిల్ మంజూరు
రేవంత్ రెడ్డికి ఏసీబీ న్యాయస్థానం షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కూతురు నిశ్చితార్థం నేపథ్యంలో బెయిల్ ఇచ్చారు. రేపు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు బెయిల్ ఇచ్చింది.
రేవంత్ మీడియా సహా రాజకీయ నేతలను కలవరాదని కోర్టు చెప్పింది. రూ.50వేల ష్యూరిటీ సమర్పించాలి. కేసు వివరాలు మీడియాకు చెప్పవద్దు. రేవంత్ రెడ్డి కదలికలపై ఎస్కార్ట్ నిఘా పెట్టాలి. సాయంత్రం ఆరు గంటలకు తిరిగి కోర్టులో లొంగిపోవాలి. ప్రధాన బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం తోసిపుచ్చింది.