రేవంత్ కు సుప్రీం షాక్ : ఇంప్లీడ్ పిటిషన్ తిరస్కరణ
హైదరాబాద్ : ఫిరాయింపు ఎమ్యెల్యేలపై చట్టపరమైన చర్యలు చేపట్టాలంటూ కాంగ్రెస్, టీడీపీ నేతలు కోర్టుల చుట్టూ తిరుగుతోన్న సంగతి తెలిసిందే. దీనిపై అప్పట్లోనే స్పీకర్ కు వినతిపత్రం అందజేసిన నేతలు.. స్పీకర్ నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడంతో.. సుప్రీంను ఆశ్రయించారు.
పిటిషన్ దాఖలు చేసింది కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యే సంపత్ కుమార్ కాగా, టీడీపీ తరుపున ఎర్రబెల్లి దయాకర్ రావు. అయితే కొద్ది నెలల కిందటే ఎర్రబెల్లి టీడీపీకి గుడ్ బై చెప్పి గులాబీ గూటికి చేరడంతో పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మాత్రమే దీనిపై పోరాటం చేస్తూ వస్తున్నారు. ఇకపోతే టీడీపీ నుంచి ఎర్రబెల్లి బయటకువెళ్లిపోవడంతో.. కేసు విచారణలో తనను ఇంప్లీడ్ చేయాలని కోరుతూ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలో.. తాజాగా రేవంత్ పిటిషన్ ను సుప్రీం తిరస్కరించింది. విచారణను వచ్చే నెల 19కి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే విచారణకు స్వీకరించకుండా పిటిషన్ ను తిరస్కరించడంతో రేవంత్ ఒకింత షాక్ తిన్నారు. ఇదే కేసుకు సంబంధించి స్పీకర్ కు సైతం సుప్రీం నోటీసులు జారీ చేయగా, కేసులో తాను ఇంప్లీడ్ అయి టీడీపీ నుంచి బయటకు వెళ్లిన నేతలను తీవ్ర ఇరకాటంలో పెట్టాలని ప్లాన్ చేశారు రేవంత్. కాగా సుప్రీం రేవంత్ పిటిషన్ ను తిరస్కరించడంతో ఆయన ప్లాన్ బెడిసికొట్టినయింది.