టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో విచక్షణాధికారాలు వినియోగించండి: గవర్నర్కు రేవంత్
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో గవర్నర్ తనకున్న విచక్షణాధికారాలను వినియోగించి బోర్డును రద్దు చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరారు.
హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో గవర్నర్ తనకున్న విచక్షణాధికారాలను వినియోగించి బోర్డును రద్దు చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరారు. పేపర్ లీకేజీపై కాంగ్రెస్ నేతలు బుధవారం గవర్నర్కు ఫిర్యాదు చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సిట్ విచారణను ఎదుర్కోవాల్సిన టీఎస్పీఎస్సీ ఛైర్మన్, కార్యదర్శి సెక్షన్ ఆఫీసర్ను కాపాడే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
టీఎస్పీఎస్సీ లో జరిగిన అవకతవకలకు కేటీఆర్ మంత్రిగా ఉన్న ఐటీ శాఖే కారణమని, ఆ శాఖ పరిధిలో తప్పిదాలు జరగడంతో లక్షలాది విద్యార్థులు జీవితాలతో చెలగాటం ఆడుతున్నామన్నారు. కొంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. పారదర్శకత లోపించడంతో ప్రభుత్వంతో ఉన్న పెద్దలు అక్రమాలకు పాల్పడి ప్రశ్నపత్రాలను కోట్లాది రూపాయలకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందన్నారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 317 ప్రకారం టీఎస్పీఎస్సీలో బాధ్యులైన వ్యక్తులను గవర్నర్ సస్పెండ్ చేయొచ్చన్నారు. తద్వారా పారదర్శకమైన విచారణ జరిగేందుకు అవకాశం ఉంటుందని గవర్నర్కు విజ్ఞప్తి చేశామన్నారు. ఈ వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తున్నట్లు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారని.. న్యాయ సలహాతో చర్యలు తీసుకుంటానని ఆమె తమకు హామీ ఇచ్చారని రేవంత్ రెడ్డి తెలిపారు.
కాగా, ఇటీవల బీజేపీ నేతలు కూడా గవర్నర్ ను కలిసి పేపర్ లీకేజీ వ్యవహారంపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు, సిట్ అధికారులు టీఎస్ పీఎస్సీ పేపర్ కేసులో దర్యాప్తు జరుపుతోంది. మరోవైపు, పేపర్ లీకేజీ వ్యవహారంలో ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్కు సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications