కేసీఆర్ మనిషేకాదు: రేవంత్ రెడ్డి అరెస్ట్, వారు సిగ్గుపడ్తున్నారు: సుమన్
హైదరాబాద్: మహారాష్ట్రతో చేసుకున్న ప్రాజెక్టుల ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేపట్టిన తెలంగాణ టిడిపి నేతలు ఎల్ రమణ, రేవంత్ రెడ్డి తదితరులను పోలీసులు సోమవారం నాడు అదుపులోకి తీసుకున్నారు.
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి ర్యాలీగా జలసౌధకు చేరుకున్న నేతలు అక్కడ ధర్నా చేపట్టారు. మహారాష్ట్రతో ఒప్పందంతో తెలంగాణ ప్రజల ప్రయోజనాలను ప్రభుత్వం తాకట్టు పెడుతోందని మండిపడ్డారు. ఆ ఒప్పందాలను వెంటనే రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు.
ధర్నా చేపట్టిన నేతలను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. ఈ నేపథ్యంలో లక్డీకాపూల్ నుంచి ఎర్రమంజిల్ వరకు భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
ఒప్పందంపై రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... మహారాష్ట్రతో ఒప్పందంపై అసెంబ్లీలో నిలదీస్తామన్నారు. తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ కడితే 80 కి.మీ. మేర కాలువల ద్వారా వచ్చేదన్నారు. మేడిగడ్డ వద్దకు మార్చడం వల్ల రూ.50వేల కోట్ల అదనపు భారం పడుతుందన్నారు.
దీనికి 4700 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుందని, విద్యుత్ కోసం 40వేల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ వల్ల ప్రజల పైన లక్ష కోట్ల అదనపు భారం పడుతుందన్నారు.
కేసీఆర్ మనిషి కాదని, కసాయి అన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును పక్కన పెట్టారన్నారు. బాబ్లీ వల్ల ఉత్తర తెలంగాణ ఎడారిగా మారిందన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులలో జరిగిన అవినీతి పైన న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. మహారాష్ట్రతో ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు.
ప్రాజెక్టుల రీడిజైన్ పైన అఖిల ప్రక్షాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వద్దకు తీసుకెళ్లాలన్నారు. మహారాష్ట్రతో ఒప్పందం బూటకమని ఎల్ రమణ అన్నారు. ఈ ఒప్పందాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారన్నారు.
రేవంత్ కుట్ర: బాల్క సుమన్
రైతులకు సాగునీరు అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోంటే రేవంత్ రెడ్డి అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని తెరాస ఎంపీ బాల్క సుమన్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఇకనైనా అబద్దాలు మానుకోవాలన్నారు. రేవంత్ రెడ్డి పద్దతి మార్చుకుని బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకుంటే మంచిదన్నారు. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
తెలంగాణ ప్రాజెక్టులను ఆపేందుకు ఏపీ సర్కారు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినపుడు రేవంత్ రెడ్డి అడ్డుకుని ఉంటే బాగుండేదన్నారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్దాంతం ఇంకా తెలంగాణలో నడుస్తుందా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు ఎవరికో బెనిఫిట్ చేసినట్టు తమ తెరాస ప్రభుత్వం చేయదన్నారు. బ్లాక్ మెయిలింగ్కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ అన్నారు.
తెలంగాణ పట్ల ద్రోహ పాత్ర పోషిస్తున్న రేవంత్ రెడ్డి ఇకనైనా బుద్ది తెచ్చుకోకపోతే ఖబర్దార్ అని జమెత్తారు. గోదావరి నీళ్లు ఏపీకి పోయి తెలంగాణకు రావొద్దని రేవంత్ కుట్ర పన్నుతున్నారన్నారు. రేవంత్ తెలంగాణలో ఉంటూ ఏపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ పాలమూరులో పుట్టినందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారన్నారు.