నాకూ ఆ అనుభవం: కేటీఆర్పై ఆగ్రహం, రేవంత్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్: భాగ్యనగర రోడ్ల పైన ప్రయాణించాలంటే ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని, అలాంటి దుస్థితి తనకు కూడా ఎదురైందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సోమవారం అన్నారు. నగరంలో రహదారుల పరిస్థితిపై టిడిపి ఆందోళన చేపట్టింది.
ఎల్లారెడ్డిగూడలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులు రహదారులపై మొక్కలు నాటి నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలను అరెస్టు చేసి పోలీస్స్టేషన్ తరలించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెరాస ప్రభుత్వం నగరంలోని రహదారుల నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. గుంతలు పడ్డ రహదారులతో ప్రజలు, వాహనదారులు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వానికి కనిపించడం లేదన్నారు.
హైదరాబాద్ రోడ్ల పైన ప్రయాణించాలంటే ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారన్నారు. వందల కోట్ల రూపాయల నిధులు వినియోగించారు కానీ ఎక్కడా సరైన రోడ్లు లేవన్నారు. నగర అభివృద్ధి పట్ల మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్కు గానీ, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు గానీ చిత్తశుద్ధి లేదన్నారు. వర్షం వస్తే కార్లలో కాకుండా పడవల్లో తిరగాలన్నారు.
అన్ని హంగులతో సీఎం క్యాంపు కార్యాలయం ఉండగా వాస్తు పేరుతో వందల కోట్ల రూపాయలతో కొత్త క్యాంపు కార్యాలయం, డీజీపీ, సీఎస్ కార్యాలయాలు నిర్మిస్తున్నారని, సీఎం కేసీఆర్ ఇంత ఆడంబరాలకు పోవడం అవసరమా అని టిడిపి నేత రావుల చంద్రశేఖర రెడ్డి వేరుగా అన్నారు. కేసీఆర్ ఫాంహౌస్ నుంచి పాలన సాగిస్తుంటే షాడో సీఎం ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా పాలన సాగిస్తున్నారని కేటిఆర్ పైన మండిపడ్డారు.